గద్వాల, ఫిబ్రవరి 22 : ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు. కానీ ఈసారి రిజర్వాయర్లో అర టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. గత వానకాలం సీజన్లో రిజర్వాయర్ కింద సుమారు లక్షా 36 వేల ఎకరాలకు సాగు నీరు అందింది. అదే ఏడాది యాసంగిలో 35 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయి. కానీ ఈ యాసంగిలో పరిస్థితి దారుణంగా తయారైంది. రిజర్వాయర్ కింద పంటలకు నీరు ఇవ్వలేమని అధికారులు క్రాప్హాలిడే ప్రకటించారు.
దీంతో రైతులు పంటల జోలికి వెళ్లలేదు. బోరుబావుల కింద తప్పా ఎక్కడా సాగు కనిపించడం లేదు. కనుచూపు మేర రిజర్వాయర్లో నీరు కనిపించడం లేదు. బండరాళ్లు తేలాయి. ప్రాజెక్టులు కళ తప్పగా.. కాల్వలు వెలవెలబోతున్నాయి. వేసవి సమీపిస్తుండడంతో పశువులకు నీరు దొరకని పరిస్థితి నెలకొన్నది. జూరాలకు తొలి సారిగా వరద వచ్చిన సమయంలోనే నీటిని పంపింగ్ చేసి రిజర్వాయర్లను నింపి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని రైతులు అంటున్నారు.
పీజేపీ డ్యాం బ్యాక్ వాటర్ ఆధారంగా నెట్టెంపాడు లిఫ్ట్ నిర్మించారు. కృష్ణానది నుంచి కాల్వ ద్వారా జలాలను మళ్లించి ధరూర్ మండలం గుడ్డెందొడ్డి వరకు తరలించి పంప్హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి ర్యాలంపాడు రిజర్వాయర్కు నీరు చేరుతుంది. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లో నీటిని స్టోరేజీ చేసి అక్కడి నుంచి ఎత్తిపోస్తే ఐదు మినీ రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. ఆ తర్వాత కెనాల్స్ ద్వారా పంటలకు పారిస్తారు. ఈ రెండింటి పరిధిలో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కృష్ణా నీటిని ఎత్తిపోస్తూ కేసీఆర్ ప్రభుత్వం రెండు పంటలకు నీరు అందిస్తూ వచ్చింది. ఈ ప్రాంతం పసిడి పంటలతో కళకళలాడింది. దీంతో ఈ ప్రాంతానికి వరప్రదాయినిగా నెట్టెంపాడు ప్రాజెక్టు మారింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీరు, పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడం.. కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులు అట్టడుగు నీటిమట్టానికి చేరాయి.
ర్యాలంపాడు రిజర్వాయర్కు ప్రధానంగా 1,36,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ 104వ ప్యాకేజీ ద్వారా మార్లబీడు, అల్వాల్పాడు, కొండాపూర్, నందిన్నె వరకు మొత్తం 25 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. కుడి కాల్వ పరిధిలో 105, 106, 107 ప్యాకేజీల ద్వారా ర్యాలంపాడు, సద్దలోనిపల్లి, మల్దకల్, అయిజ, గట్టు, అరగిద్ద, చమన్ఖాన్దొడ్డి, టీటీదొడ్డి, చాగదోన, భూపురం వరకు 1,11,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రధానంగా తాటికుంట, నాగర్దొడ్డి, ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి సబ్ రిజర్వాయర్లను కలిగి ఉన్నది. ప్రస్తుతం వీటి కింద ఆరుతడి పంటలు కూడా పండే పరిస్థితుల్లేవు. ఆయకట్టంతా మోడుబారి కనిపిస్తుంది.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో సాగుజలాలు పుష్కలమయ్యాయి. ఢోకా లేకుండా రైతులు రెండు పంటలు పండించారు. దీనికి తోడు రైతుబంధు, మద్దతు ధరతో ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీతోపాటు రైతులకు ప్రోత్సాహకారాలు అందించింది. దీంతో తెలంగాణ ధాన్యాగారంగా అవతరించింది. కానీ నేడు ఎవుసం బోసిపోయింది.. ఆయకట్టు మోడుబారింది.. ఎడారిలో తువ్వ గడ్డిని పోలిన ఆకారంతో ఆయకట్టులు ఆగమ్యగోచరంగా మారాయి.
ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గత కాంగ్రెస్ పాలకుల కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. దీంతో రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి దాపురించింది. నిర్మాణ సమయంలో 4 టీఎంసీలకు డిజైన్ చేయగా.. పనులు పూర్తయ్యాక నీటిని నింపే సమయంలో కట్ట నిర్మాణానికి లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో ఇరిగేషన్ శాఖాధికారులు పూర్తి స్థాయిలో నీటిని స్టోరేజీ చేయడం లేదు. దీంతో ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలో సుమారు 20 వేల ఎకరాల సాగును రైతులు పంట నష్టపోవాల్సి వస్తుంది. కట్టకు బుంగలు పడి నీళ్లు లీకవుతున్నా పట్టించుకోలేదు. దీంతో పక్కనే కృష్ణమ్మ పారుతున్నా పూర్తిస్థాయిలో నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నడిగడ్డ రైతులకు శాపంగా మారింది.
ధరూరు, ఫిబ్రవరి 22 : యాసంగిలో సాగు చేసిన వరిపంటలకు సాగునీరు లేక పోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ఆయకట్టుకు సాగు నీరందించలేమని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అయినా కొంత మంది రైతులు బోర్ల కింద వరి పంటలను సాగు చేశారు. వాటిలో రోజురోజుకు నీటిమట్టం తగ్గిపోవడంతో వేసుకున్న పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది. ధరూర్ మండలంలోని చాలా గ్రామాల్లో బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో చాలా చోట్ల రైతులు పంటలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతకోసం వదిలేశారు. ఫిబ్రవరిలోనే సాగునీరుకు ఇంత ఇబ్బంది ఉంటే మే నాటికి కనీసం తాగునీరైనా అందుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.