TSRTC | మహబూబ్నగర్ టౌన్ / కందనూలు, జూన్ 17 : ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. మహిళలు, వయోవృద్ధులకు బస్సు ప్రయాణాల్లో ఆర్థికభారం తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అమలు చేస్తున్న టీ 624, టీ-6, ఎఫ్-24 టికెట్ల తరహాలో తొలిసారిగా జిల్లాల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. నేటి నుంచి ఈ టికెట్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ 526 పల్లెబస్సులు ఉండగా, ఇందులో 204 హైర్ బస్సులు, 322 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఉదాహరణకు మహబూబ్నగర్ నుంచి కొత్తకోటకు 50 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం కిలోమీటర్ల పరిధికి రూ.60 చార్జి చేయబడుతుంది. మహిళలు, వయోవృద్ధులకు ఆర్టీసీ తక్కువ చార్జీతో ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు టీ-9 టికెట్కు శ్రీకారం చుట్టింది. ఈ టికెట్ పొందిన మహిళలు, వయోవృద్ధులకు రూ.20 ఆదా అవుతుంది. కేవలం కొత్తకోటనే కాకుండా మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణ దూరాన్ని బట్టి రాయితీ చార్జీలు వసూలు చేస్తారు. రూ.100 చెల్లిస్తే 60కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకు ఈ టికెట్ వర్తిస్తుంది. పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటులో టీ-9 టిక్కెట్లు ఉంటాయి. మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఈ టికెట్తో లబ్ధిచేకూరనుంది.
సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామీణ, పట్టణ మహిళలు, వయోవృద్ధులకు బస్సు ప్రయాణా ల్లో ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ టీ-9టిక్కెట్ను అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలుకానున్నది. మహిళలు, వయోవృద్ధ్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వి.శ్రీదేవి, ఆర్టీసీ మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్