నెట్వర్క్ మహబూబ్నగర్,ఆగస్టు 1 ;టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయంపై నూతనోత్సాహం నెలకొన్నది. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 3,440 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. ఇకపై వీరంతా ప్రభుత్వ ఉద్యోగుల్లా కొనసాగనున్నారు. దీంతో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. 9 డిపోల ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు. సంతోషంతో కార్మికులు ఈలలు వేస్తూ డ్యాన్స్లు చేశారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపి స్వీట్లు తినిపించారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, మక్తల్, కోస్గిలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య పాల్గొన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల ఆనందం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మంగళవారం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో సంబురాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఈ సాహసోపేత నిర్ణయం కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేలును ఎప్పటికీ మర్చిపోమన్నారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. మహబూబ్నగర్ రీజియన్లో 3,440 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్ఎం శ్యామల, బాబునాయక్, డీఎం సుజాత, సీఐ భాను, ఎంఎఫ్ శ్రీకాంత్, ఉద్యోగులు పాల్గొన్నారు.
సర్వత్రా హర్షం
ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మంగళవారం నాగర్కర్నూల్ డిపోలో డీఎం దేవరాజు ఆధ్వర్యంలో పలువురు కార్మికులు సంబురాలు చేసుకున్నారు. పద్మశ్రీ కిన్నెర మొగులయ్యతో కలిసి కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనం కోసం పోరాటం చేసి అమరులైన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి రెట్టింపు సంతోషంతో పనిచేసేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేస్తారన్నారు. కార్మికులపై ప్రేమతో నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షిస్తున్నామన్నారు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో సంస్థ అభివృద్ధికి పాటుపడాలని డీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కిన్నెర మొగులయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆర్టీసీ కార్మికుడు, పెయింటర్ శేఖర్ పాడిన పాట ఆకట్టుకుంది.
ఉద్యమ పోరాటానికి ఫలితం
తెలంగాణ ఉద్యమ కాలం నాటి పోరాటానికి ఫలితం దక్కిందని వనపర్తి డీఎం వేణుగోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం వనపర్తి డిపోలో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్మికులు, ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కండ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. ఉద్యమ సమయంలో కార్మికులు కేసీఆర్ వెన్నంటే ఉంటూ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. ఎన్నో ఏండ్ల కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ఆదరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. అంతకుముందు కార్మికులు, నాయకులు మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో డిపో సహాయ మేనేజర్ చంద్రమౌళి, కార్మికులు రవీందర్గౌడ్, పీఆర్గౌడ్, జేవీ.స్వామి, రమేశ్, నాగరాజు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ప్రమోద్రెడ్డి, ప్రేమ్కుమార్, కిట్టు, యాది, గిరి, తిరుమల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనకు నిర్వహించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్న ఘనుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం డిపో ఆవరణలో డీఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కార్యక్రమం లో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
కార్మికుల కల నెరవేరింది..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వరంగ సంస్థలోకి విలీనం చేయడంపై కోస్గి మండల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కోస్గి బస్ డిపోలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కల నేరవేరిందని.. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగ సంబురం
ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిగితేలారు. మంగళవారం కొల్లాపూర్ ఆర్టీసీ డిపోలో మేనేజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. డిపోలో వివిధ విభాగాల్లో విధులు 248మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 2017, 21 పీఆర్సీల కోసం నిరీక్షిస్తున్న క్రమంలో ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయమన్నారు. కార్యక్రమంలో ఏఎంఎఫ్ రంజిత్కుమార్, సూపరింటెండెంట్ నజీరుద్దీన్, వెల్ఫేర్ కమిటీ సభ్యులు ప్రవీణ్కుమార్, ఖాజా, రామయ్యయాదవ్, అయూబ్, సెక్యూరిటీ హెడ్ రామకృష్ణ, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు పాల్గొన్నారు.
ఆర్టీసీకి అండగా సీఎం కేసీఆర్
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మక్తల్ ఆర్టీసీ బస్టాండ్లో నారాయణపేట డీఎం లక్ష్మీసుధ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, మహిపాల్రెడ్డి, అమరేందర్రెడ్డి, రామలింగం, న ర్సింహారెడ్డి, నర్సింహులు, నేతాజీ, శేఖర్, ఆనంద్, శివారెడ్డి, ఆర్టీసి కార్మికులు సరస్వ తి, ప్రభాకర్, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, మైబూబ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రికి ధన్యవాదాలు
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గర్వకారణంగా ఉన్నది. సీఎం కేసీఆర్ మేలు చేస్తాడని నమ్మి విధుల్లో చేరిన మొదటి కార్మికుడిని.. నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్కారు ఉద్యోగులుగా గుర్తించడం ఆనందంగా ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం కేసీఆర్కు, ఇందుకు కృషి చేసిన మంత్రి నిరంజన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– నాగరాజు, కండక్టర్, వనపర్తి డిపో
కేసీఆర్కు రుణపడి ఉంటాం
ఆలస్యమైనప్పటికీ ఆ ర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమం త్రి కేసీఆర్ గుర్తించి ప్రభుత్వంలో విలీన చేయడం సాహాసోపేతమైన నిర్ణయం. ఆ ర్టీసీ కార్మికులమంతా కేసీఆర్కు రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో ఆగ్రభాగాన ఉండి పోరాడిన దాంట్లో ఆర్టీసీ కార్మికులే కీలకం. సమ్మె సమయంలో 36మంది కార్మికులు అసువు లు బాశారు. బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. 2017, 21 పీఆర్సీని అమలుచేస్తే బాగుండు.
– రామయ్యయాదవ్, కండక్టర్, కొల్లాపూర్ డిపో
చాలా గర్వంగా ఉంది..
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. కొంత అలస్యమైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీకి అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– పద్మ, కండక్టర్, మహబూబ్నగర్ డిపో