వాహనదారులు, ప్రజలకు ప్రయాణ భారం తగ్గింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్, మహబూబ్నగర్కు డివిజన్, నియోజకవర్గ కేంద్రాల నుంచి రాకపోకలు సాగించాలంటే భయపడే పరిస్థితులు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా జిల్లాలు ఏర్పడటం.. పరిపాలన ప్రజలకు చేరువ కావడం.. ప్రయాణ సమయమూ సగానికి తగ్గింది. నియోజకవర్గ కేంద్రాలను కలిపే రోడ్లతో పాటుగా గ్రామాల్లోని అంతర్గత రోడ్లకు సొబగులు వచ్చాయి. జబర్దస్త్ రాస్తాలతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ట్రా‘ఫికర్’ తీరింది. పల్లె, పట్నం టు హైదరాబాద్తోపాటు ఇతర నగరాలకు రయ్.. రయ్ మంటూ వాహనాలు దూసుకెళ్తున్నాయి. పెరిగిన వేగంతో గమ్యస్థానాలకూ ప్రజలు త్వరగా చేరుకుంటున్నారు. రహదారులు అద్దాల్లా మెరుస్తూ హైవేలను తలపిస్తుండగా.. డివైడర్లు, పచ్చని మొక్కలతో సుందరంగా.. ఆహ్లాదకరంగా మారాయి.
వనపర్తి, మే 17 : గతుకుల రోడ్లను తొలగించి రహదారుల విస్తరణతో ప్రజలకు ప్రయాణ ఇక్కట్లు తగ్గాయి. తెలంగాణ ఏర్పడక ముందు పాలమూరుకు వెళ్లాలంటే వనపర్తి నుంచి రెండు మార్గాల్లో.. ఖిల్లా ఘణపురం మీదుగా 56 కిలోమీటర్లు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండగా.. మూడు గంటల సమయం పట్టేది. కొత్తకోట మీదుగా అయితే నేషనల్ హైవే ఉండడం వల్ల పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. వనపర్తి నుంచి కొత్తకోటకు 14 కిలోమీటర్ల దూరానికే దాదాపు 45 నిమిషాలు పట్టేది. గోపాల్పేట మీదుగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణానికి 25 నిమిషాలు పట్టేది. హైదరాబాద్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు వనపర్తి నుంచి గోపాల్పేట వెళ్లే మార్గంలో రెండు పెద్ద కల్వర్టుల నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. గడిచిన మూడేండ్లలో వనపర్తికి చుట్టూ 88.50 కిలోమీటర్ల రోడ్లను రూ.213.65కోట్లతో నిర్మించి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
అభివృద్ధి వివరాలు
బీటీ రోడ్డుతో చెక్
విలియంకొండ నుంచి నాచారం పేటకు వెళ్లాలంటే ప్రయాణం నరకంగా ఉండేది. దారి మధ్యలో ఒక చెరువు నిండి ఉండడం తో మోకాళ్ల ఎత్తు వరకు నీళ్లు నిలిచి ఉండేవి. మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. తె లంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో 4కిలోమీటర్ల బీటీ రోడ్డును రూ.3కోట్లతో నిర్మించడంతో సమస్య తీరింది.
– గోపాల్నాయక్, నాచారంపేట గ్రామం, కొత్తకోట మండలం
మంచి సౌలత్లు వచ్చినయ్!
గతంలో అనారోగ్య సమస్య వస్తే సరైన రోడ్డు లేక ఎడ్లబండిపై గోపాల్పేటకు వచ్చేవాళ్లం. తండా నుంచి ఎక్కడికి పోవాలన్న 3 కిలోమీటర్లు ప్రయాణం తప్పనిసరి. వాన పడితే శాన తిప్పలు అయ్యేది. రోడ్డుపై బైక్ కూడా పోయేదికాదు. ఇప్పుడు ఆ తిప్పలు లేవు.. కేసీఆర్ సర్కారు వచ్చినంక మా తండాకు డాంబర్ రోడ్డు వచ్చింది. ఎంత రాత్రి అయినా ఇబ్బంది లేకుండా తండాకు వస్తున్నం. రాకపోకలకు ఏమీ ఇబ్బంది లేదు. – శంకర్ నాయక్, జింకలబీడుతండా , గోపాల్పేట మండలం
పూర్తయిన వంతెనలు