– మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్/టౌన్, మే 14
పాలమూరులో తొలిసారిగా నిర్వహించిన ప్రాపర్టీషోకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో శ్రీజయరామ, సిరిసంపద ప్రధాన స్పానర్లతోపాటు గిరిధారి, దేవాస్ ఇన్ఫ్రా ఎంవీపీ స్పేసెస్, స్కంధాన్షి, కామాక్షి, రెయిన్బో డెవలపర్ ఆగ్రో ఫార్మర్స్, ప్రముఖ రియల్ ఎస్టేట్స్ రంగ దిగ్గజాల సహకారంతో నిర్వహించారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోను కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘రియల్’ వ్యాపారులు, బ్యాంకర్లు, నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల కొనుగోలుపై అవగాహన కల్పించాయి. ఈ సందర్భంగా పలువురువక్తలు మాట్లాడుతూ స్థిరాస్తి కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఇదో చక్కని వేదికగా అభివర్ణించారు. పాలమూరు మహానగరం వైపు అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. సొంతింటి కలను నిజం చేసేందుకు వేదికను ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ’కు అటు ప్రముఖుల నుంచి.. ఇటు వినియోగదారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు ఊహించని స్పందన లభించింది. పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన షోకు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల నుంచి వినియోగదారులు భారీగా తరలివచ్చారు. వివిధ స్టాల్స్ సందర్శిస్తూ తమకు అనుకూలంగా ఉన్న ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నూతన పోకడలను వివరించారు. బ్యాంకుల్లో గృహ రుణాల వడ్డీ శాతం, ఈఎంఐ వివరాలపై ఆరా తీశారు. తమకు అనుకూలంగా ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. నేడు కూడా ప్రాపర్టీ షో కొనసాగనున్నది.