జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 99 మంది స్టాఫ్ నర్సులకుగానూ కేవలం 19 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఎందరో దవాఖానల్లో స్టాఫ్ నర్సులు లేక ప్రసవాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 13 ప్రాథమిక దవాఖానలు ఉంటే.. రెండు బస్తీ దవాఖానలు, మరో రెండు యూపీహెచ్సీ(అర్బన్ హెల్త్ సెంటర్)లు ఉన్నాయి. మొత్తం 17 దవాఖానలు ఉండగా.. వీటికి అదనంగా మరో 3 సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) పని చేస్తున్నాయి. అయితే, పీహెచ్సీలన్నీ 24 గంటలపాటు వైద్య సేవలందించేవిగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా స్టాఫ్నర్సులు నలుగురుంటేనే ప్రసవాల సేవలందించేందుకు వీలవుతుంది. ఇలా నలుగురు స్థానంలో ప్రస్తుతం జిల్లాలోని అన్ని దవాఖాల్లో ఒక్కొక్కరే స్టాఫ్ నర్సులు విధుల్లో ఉన్నారు. ఇతర వైద్య సహాయం సంగతి అటుంచితే… ముఖ్యంగా ప్రసవాలకు మాత్రం ప్రభుత్వ దవాఖానల్లో సేవలు మందగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో స్టాఫ్ నర్సులున్న చోట ప్రసవ సేవలందడం గగనమైంది.
వనపర్తి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య త గ్గిపోతున్నది. గతంలో ‘నేను రాను బిడ్డో.. స ర్కారు దవాఖాన’కు అన్న రోజులు మళ్లీ దా పురించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేయగా.. నిరంతరం కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తి జిల్లాలో మాత్రం కాన్పులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో పనిచేస్తు న్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్లో చాలా మందికి పర్మినెంట్ ఉద్యోగాలు రావడంతో ఒక్కసారిగా ప్రభుత్వ వైద్యశాలల్లో అధికంగా ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లాలోని పలు దవాఖానల్లో కాన్పులను చూసే స్టాఫ్ నర్సులు లేకపోవడంతో ప్రసవాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
గతేడాది కేసీఆర్ ప్రభుత్వంలో కాన్పుల సంఖ్య బా గా ఉండేది. 2023 మార్చి నుంచి 2024 జనవరి వర కు సర్కారు దవాఖానల్లో కాన్పుల వివరాలను పరిశీలి స్తే.. ప్రతి నెలా 750 నుంచి 850 వరకు ప్రసవాలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ నేడు గణనీయంగా కాన్పులు తగ్గాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. సగానికి కొంత అటు.. ఇటుగా సంఖ్య పడిపోయినట్లు గా అర్థమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో దవాఖానలను ప్రక్షాళన చేసి వైద్య సేవలు గణనీయంగా పెంచడంతో ప్రజలంతా దవాఖానల బాటపట్టారు. ఏ దవాఖాన చూసినా సేవలకు ఇబ్బంది రానివ్వకుండా చర్య లు తీసుకుంటుండడంతో ప్రజలకు విరివిగా సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ప్రైవేట్ ద వాఖానలకు వెళ్లి రూ.వేలు ఖర్చు చేసి కాన్పులు చేయించుకునే పరిస్థితి ఉండేది.. నాటి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సర్కారు వైద్యశాలల్లోనే కాన్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రెండు నెలలుగా తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి, మార్చిలో సంఖ్య మరింత తగ్గింది. కారణాలేమైనా సర్కారు దవాఖానల్లో డెలివరీలు సగానికిపైగా తగ్గడం కనిపిస్తున్నది. కాగా జనవరి నుంచి దవాఖానల్లో ఒ క్కొక్క స్టాఫ్నర్సు మాత్రమే విధుల్లో ఉండడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.
వనపర్తి జిల్లాలోని అన్ని దవాఖానల్లో స్టాఫ్ నర్సుల సంఖ్య తగ్గిపోయింది. దాదాపు అన్ని చోట్ల కూడా ఒక్కొక్కరే ఉన్నారు. గతంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే సిబ్బంది పర్మినెంట్ ఉద్యోగాలకు వెళ్లారు. దీంతో ఖాళీల సంఖ్య ఏర్పడింది. భర్తీ కోసం ఫిబ్రవరిలోనే ప్రకటన జారీ చేశాం. ఎన్నికల కోడ్ రావడంతోనే భర్తీ ప్రక్రియ నిలిచింది. కోడ్ ముగిసిన వెంటనే భర్తీ చేస్తాం. అంత వరకు ఉన్న సిబ్బందితోనే పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రధానంగా స్టాఫ్నర్సుల కొరత ఉన్నందునే ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య తక్కువగా నమోదైంది.
జిల్లాలోని దవాఖానల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనను విడుదల చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ గత ఫిబ్రవరిలో ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్ల కోలాహలంతో ఈ ప్రక్రియ ప్రారంభంలోనే నిలిచిపోయింది. ఇలా మరో రెండునెలల వరకు ఈ స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియకు బ్రేకులు పడినట్లుగానే భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కాగా మొత్తం 26 పోస్టులకు ప్రకటన జారీ చేయగా, వీటిలో 17 వరకు స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయి.