మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 7 : మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నె గ్గడంతో కొత్త వారిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన పురపాలక సమావేశం ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 27న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంలో ఆయా పార్టీలు కలిసివచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి దిశానిర్దేశం చే శారు. కాగా, బీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునేందుకు పలువురిని సంప్రదించారు. దీంతో చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ను వీడిన 21వ వార్డు కౌన్సిలర్ ఆనంద్కుమార్గౌడ్ కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల మద్దతు కూడా ఈయనకే ఉన్నది. అయితే, వైస్ చైర్మన్ పదవి ని మాత్రం ముస్లిం కౌన్సిలర్కు కేటాయించాలని పలువురు కోరుతుండగా.. ఎంఐఎం మాత్రం తమ కౌన్సిలర్కు ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుబడుతున్నది. తమకూ అవకాశం కల్పించాలని బీజేపీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. అయితే 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మొయిన్ అలీ వైపు కాంగ్రెస్ నాయకులు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ తరపున కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన షబ్బీర్ అహ్మద్ సైతం వైస్ చైర్మన్ పదవి కావాలని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో తలమునకలవుతున్నారు.
మహబూబ్నగర్ పురపాలికలో 49 మంది కౌన్సిలర్లు ఉండగా, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు కలుపుకొని మొత్తం 50 ఓట్లు ఉన్నాయి. గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఈనెల 12వ తేదీన నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి 26 మంది హాజరై.. ఏ అభ్యర్థిని బలపరిస్తే వారికే పుర చైర్మన్ పీఠం దక్కనున్నది. వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికకు సైతం ఇదే ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.