సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల లోతులో జలాలు ఉండగా.. ప్రస్తుతం 6.53 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇప్పటికే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోగా.. బోరు బావుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతుండడంతో ఆశలు అడుగంటుతున్నాయి. కొందరు రైతులు ఎన్నో ఆశలతో వేసిన ఆరుతడి, వరికి నీళ్లు అందకపోవడంతో పశువులు, గొర్రెల మేతకు వదిలేశారు. దీంతో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. కోటి ఆశలతో పెట్టుబడులు పెట్టిన రైతన్నలు కంటతడి పెడుతున్నారు.
గద్వాల, మార్చి 21 : జిల్లాలో పాత రోజులు దాపురించాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నీళ్లులేక అడుగంటాయి. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గడంతో బోర్లల్లో నీటిమట్టం పడిపోయింది. వేసిన పంటలకు నీరందక రైతులు ఎండబెడుతున్నారు. కష్టపడి పండించిన పంట కండ్లెదుటే పాడవుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పించిందని పలువురు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నదులకు వరద వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులను నింపేవారని అంటున్నారు. దీంతో ఏడాదికి రెండు, మూడు పంటలు పుష్కలంగా పండేవని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో సాగుకు గడ్డుకాలం ఏర్పడిందని వాపోతున్నారు. జూరాలకు వరద వచ్చిన సమయంలో చెరువులు, రిజర్వాయర్లు నింపకుండా అధికారులు దిగువకు నీటిని విడుదల చేయడంతో నేడు సాగునీరు పారని దుస్థితి తలెత్తిందని ఆందోళన చెందుతున్నారు. దీంతో యాసంగి పంటల సీజన్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటు కృష్ణ, అటు తుంగభద్ర నదులు నీళ్లులేక వట్టిపోవడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టు కింద కూడా అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఇదే పరిస్థితి. చాలా కాలం తర్వాత పంటలు లేక.. చేతికి పని లేకుండా కర్షకులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. చేయూతనివ్వాల్సిన రేవంత్ సర్కారు మాయమాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగిలో ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించగా.. చాలా మంది రైతులు బోర్ల కింద పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు నీళ్లులేక బోసిపోయాయి. రోజురోజుకూ బోర్లల్లో సైతం నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో వేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. కొందరు రైతులు ఆశలు వదులుకొని పంటలను పశువులు, గొర్రెల మేతకు వదిలేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ప్రస్తుతం 6.53 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతంలో బోర్లలో రెండు ఇంచులకుపైగా నీరు రాగా.. ప్రస్తుతం ఇంచు నీరు కూడా రాని పరిస్థితి నెలకొన్నది. గద్వాల మండ లం లత్తీపురం శివారులో రైతుల బోర్ల నుంచి చిన్న నీటిధారలు వస్తుండడంతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. వచ్చే అరకొర నీటితో వేసిన వరి పైరును కాపాడుకుంటున్నారు. కేటీదొడ్డి, గట్టు, ధరూర్తోపాటు గద్వాల మండలం గువ్వలదిన్నె, పెంచికలపాడు, చెన్నారెడ్డిపల్లి, జమ్మిచేడు గ్రామాల్లో రైతులు వరి, వేరుశనగ, మిరప పంటలు వేశారు. బోర్లు ఎండిపోవడంతో పంటలను వదిలేశారు. రైతులకు పెట్టుబడి కూడా రాక పోవడంతో దిగులు చెందుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ చేసి ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు మాకు త గిన శాస్తి జరిగింది. అధికారంలోకి వస్తే రైతుబంధు ఇస్తాం.. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల ఓట్లు దండుకొని.. ఇప్పుడు రైతుబం ధు, రుణమాఫీ చేయకుండా ‘చేయి’చ్చింది. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత ఖర్చయినా భరించి పెట్టుబడి సాయం అందజేసింది. కాంగ్రెస్ పాలనలో మూడు ఎకరాలకే రైతుబంధు సాయం అందింది. నీళ్లులేక ప్రాజెక్టుల కింద అధికారులు క్రాప్హాలీడే ప్రకటించారు. బోర్ల కింద పంటలు సాగు చేస్తే కరెంట్ సరఫరా సక్రమంగా రావడం లేదు. నీటి కోసం నానా పాట్లు పడుతున్నాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
ధన్వాడ, మార్చి 21 : యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు అడుగంటి పోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో చేసేదిలేక రైతులు పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. మండలంలోని ఎంనోనిపల్లిలో గౌను జయమ్మ రెండు ఎకరాలు, మందిపల్లిలో మాధవరెడ్డి ఎనిమిది ఎకరాల్లో వరి పంట సాగు చేయగా నీరు లేక పోవడంతో పంటంతా ఎండిపోయింది. అదేవిధంగా రామకృష్ణారెడ్డికి చెందిన నాలుగు ఎకరాల వరిపంట కూడా ఎండిపోయి పొలం నెర్రెలు బారడంతో వారు తమ పంటలను గొర్రెలు, మేకలు, పశువుల మేతకు వదిలేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే పైసా కూడా చేతికి రావడంతో లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల కిందట ఇలాంటి పరిస్థితి ఉండేదని, మళ్లీ ఇప్పుడు మొదటికొచ్చిందని వాపోతున్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మూసాపేట, మార్చి 21 : పదేండ్లు ఏటా రెండు పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ కాలు పెట్టిన వేళా విశేషమో ఏమో కాని రైతులు పంటలు పండించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మండలకేంద్రానికి చెందిన సందుల ఆంజనేయులుకు చెందిన రెండు ఎకరాల పొలాన్ని అచ్చాయపల్లికి చెందిన బాలయ్య కౌలుకు తీసుకొని యాసంగిలో వరి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ సరఫరా సక్రమంగా ఇవ్వకపోవడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చేతికందివచ్చిన పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేది లేక బాలయ్య పంటను పశువుల మేతకు వదిలేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని, అందుకే రైతుబంధు విడుదల చేయడం లేదని, వ్యవసాయానికి కరెంట్ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూత్పూర్, మార్చి 21 : రాష్ట్రంలో రైతులు ఎంతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు నీరు లేక పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగాపూర్కు చెందిన అనుక కృష్ణయ్యకు నాలుగున్నర ఎకరాలు ఉండగా.. రెండెకరాల పొలంలో రూ. 50 వేలు అప్పు తెచ్చి వరి పంటను సాగు చేశాడు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పోవడంతో సాగు చేసిన పంటను కాపాడు కోవడం కష్టంగా మారింది. ఒక వైపు బోరులో నీరు అడుగంటడంతోపాటు కరెంట్ కోతలతో ఎండిన పంటను పశువుల మేత కోసం వదిలేశాడు. అయితే ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుబంధును కూడా వేయకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుబంధును వేయడంతోపాటు ఎండిన పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలు వురు అన్నదాతలు కోరుతున్నారు.
కొల్లాపూర్, మార్చి 21 : కొల్లాపూర్ శివారులో మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న బావి నీరులేక వెలవెలబోతున్నది. గతేడాది ఇదే నెలలో కాల్వలు పారడంతో బావి జలకళను సంతరించుకున్నది. నేడు నీటి విడుదల నిలిచిపోవడంతో బావిలో నీళ్లు తగ్గి పొలాలన్నీ బీళ్లుగా మారాయి.