వనపర్తి, మార్చి 15 : వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా చేపడుతున్నారు. వర్షపు నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు పెద్ద పెద్ద కల్వర్టులు నిర్మించారు.
జిల్లా కేంద్రానికి తూర్పు దిక్కున పాత వనపర్తి పట్టణంతో కలుపుకొని హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రధాన రహదారి ఉన్నది. గతంలో ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు.
రోడ్ల విస్తరణలో భాగంగా పాత పట్టణంలోని బాధితులతో మంత్రి నిరంజన్రెడ్డి పలుమార్లు చర్చించి పనులు చేపట్టేందుకు ఒప్పించారు. ఇప్పటివరకు దాదాపుగా 80 శాతం పనులు పూర్తయ్యాయి. మురికి కూపంగా ఉన్న నల్ల చెరువును సుందరీకరణ చేయడంతోపాటు రూ.11 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దఫాలుగా ట్యాంక్బండ్పై బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఇదే రహదారిపై రూ.17 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం, పీజీ కళాశాలను ఏర్పాటు చేయడంతో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. వర్షాలు భారీగా కురిసే సమయంలో జెర్రిపోతుల మశమ్మ వాగులో కొట్టుకుపోయి ముగ్గురు చనిపోయారు. వాగు ఉధృతి తగ్గే వరకు రాకపోకలు నిలిచిపోయేవి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కల్వర్టుతోపాటు రహదారి వెడల్పు చేపట్టారు.
వనపర్తి పట్టణానికి పడమర దిక్కున కొత్తకోట రోడ్డు ఉన్నది. ఈ రహదారి చిన్నగా ఉండడంతో.. ముందుగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేశారు. వనపర్తి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తకోటకు ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వెళ్లే వీలున్నది. అలాగే ఈ రహదారికి ఆనుకొని 36 ఎకరాల్లో వ్యవసాయ కళాశాల, ఐఐఐటీ కళాశాల ఉన్నాయి రాజపేట శివారులోని 20 గుంటల భూమిలో రూ.20 లక్షలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జయశంకర్ రాక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నాగవరం తండా శివారులో ముస్లింల కోసం రూ.2.80 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కూడిన షాదీఖానను రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ రహదారిని కలుపుతూ రింగ్ రోడ్డు వేసేలా మంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
వనపర్తికి ఉత్తరం దిక్కున చిట్యాల మీదుగా మహబూబ్నగర్కు వెళ్లే ప్రధాన రహదారి ఉన్నది. జిల్లా కేంద్రానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల గ్రామ శివారులో రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన వ్యవసాయ మార్కెట్ను నిర్మించారు. 42 ఎకరాల్లో రూ.44 కోట్లతో ఈ మార్కెట్ను అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించారు. చిట్యాల రోడ్డును వెడల్పు చేయడంతో బుద్ధారం నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో రద్దీ తగ్గింది. రోడ్డు వెడల్పు, అధునాతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు రావడంతో ఇక్కడి భూములకు రెక్కలు వచ్చాయి.
పట్టణానికి దక్షిణాన పెబ్బేర్ రోడ్డు ఉన్నది. ఈ రహదారిలో రూ.4 కోట్లతో ఎకో పార్కును ఏర్పాటు చేశారు. ఈ దారిలో రూ.51.7 కోట్లతో నూతన సమీకృత కలెక్టరేట్, రూ.8 కోట్లతో అధికారుల భవన సముదాయం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.54 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల, రూ.184 కోట్లతో మెడికల్ కళాశాల, రూ.83 లక్షలతో చిల్డ్రన్స్ హోం బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.45 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులు పూర్తయ్యాయి. డ్రగ్స్ స్టోర్ పనులు ప్రారంభమయ్యాయి. రూ.3.20 కోట్లతో రాష్ట్రంలోనే తొలి వే సైడ్ మార్కెట్ను సింజెంటా సంస్థ సభ్యులతో మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఇలా వనపర్తి నలుదిక్కులా అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
కనీవినీ ఎరుగని రీతిలో..
వనపర్తి జిల్లాగా ఏర్పాటయ్యాక ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా చేస్తున్నారు.అటు విద్యా రంగంలో ఇటు ప్రజల సౌకర్యార్థం కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అభివృద్ధికి చిరునామాగా మంత్రి నిలుస్తూ.. జిల్లా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
– గట్టుయాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, వనపర్తి
వేగవంతంగా రోడ్ల విస్తరణ..
మంత్రి నిరంజన్రెడ్డి ముందు.. తరువాత అన్న రీతిలో వనపర్తి అభివృద్ధి ఉన్నది. జిల్లాకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్యాలయాలు, పార్కులు, మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, ఐఐఐటీ, పీజీ, మత్య్స, వ్యవసాయ కళాశాలలు, మాతా శిశు సంరక్షణ కేంద్రం వంటివి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మురికికూపాలుగా ఉన్న చెరువులను సుందరీకరణ చేపట్టారు. ఎండాకాలంలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. 30 ఏండ్లుగా కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా చేపడుతున్నారు.
– వాకిటి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్, వనపర్తి