అభిజిత్ లగ్న సుముహూర్తాన.. వేదమంత్రాల సాక్షిగా.. అశేష భక్తజనం సమక్షంలో సీతారాములు ఒక్కటయ్యారు. గురువారం శ్రీరామ నవమి వేడుకలతో ఉమ్మడి జిల్లావాసులు తన్మయత్వం చెందారు. భక్తుల కోలాటాలు, జై శ్రీరాం.. జై జై శ్రీరాం అంటూ జయజయ ధ్వానాల హోరు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య వేడుక ఆధ్యంతం వైభవంగా జరిగింది. వరుడు దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు, వధువు జనక మహారాజు గారాల పట్టి.. జగన్మాత జానకమ్మ పెండ్లి పీటలెక్కారు. పట్టువస్ర్తాలు అలంకరించుకున్న దేవతామూర్తుల కల్యాణతంతును కనులారా వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సిరుసనగండ్లతోపాటు పలు రామాలయాలు జనసంద్రాన్ని తలపించాయి. సాయంత్రం పురవీధుల్లో శోభాయాత్రలు నేత్రపర్వంగా సాగాయి. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకలో పాల్గొన్నారు.
– నెట్వర్క్ నమస్తే తెలంగాణ, మార్చి 30
పాలమూరు, మార్చి 30 : శ్రీరాముడి కృపతో మహబూబ్నగర్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ వేడుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాలకు మంత్రి హాజరయ్యారు. శ్రీనివాసకాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి మంత్రి, ఆయన సతీమణి శారదతో కలిసి పట్టువస్ర్తాలను సమర్పించారు.
టీచర్స్ కాలనీలోని రామాలయం, భగీరథ కాలనీలోని ఆంజనేయ స్వామి, ధనలక్ష్మి కాలనీలోని ఆంజనేయస్వామి, పంచముఖి ఆం జనేయస్వామి, టీడీ గుట్టలోని తిరుమలనాథ, కోస్గి రోడ్లోని రామాంజనేయ స్వామి, హనుమాన్పురలోని పవనపుత్ర వీరాంజనేయ స్వామి, శివశక్తినగర్లోని శివాలయం, రాంమందిర్ చౌరస్తా వద్ద ఉన్న చంద్రగురుస్వామి రామ మందిరం, రామకోటి స్తూపాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని సీతారాము ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో ఆలయాల అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో అన్ని ఆ లయాలకు మహర్దశ చేకూరుతున్నదన్నారు.
మన్యంకొం డ ఆలయాన్ని సైతం ఊహించని విధంగా సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రోప్వే నిర్మిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మర్లు, ఎస్సార్ నగర్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మర్లు ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన శోభాయాత్రలో మంత్రి పా లుపంచుకున్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.