మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 19 : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివిటిపల్లి ఎలా ఉండేది, నేడు ఎలా మారిందో మీ కళ్లముందే కనిపిస్తుందన్నారు. ఐటీ పార్కుతోపాటు మరిన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్లు, బీటీ రోడ్డుతోపాటు భవిష్యత్లో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల సమయంలో మోసం చేసే నాయకులు వస్తుంటారు, పోతుంటారని, ప్రజల మధ్య ఎవరుండి అభివృద్ధి చేస్తారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కుల,మత రాజకీయాలు చేస్తారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు బంద్ చేయించారన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, కష్టాల్లో పలుపంచుకునే బీఆర్ఎస్ను ఆదరింఆలని పిలుపునిచ్చారు.
70ఏండ్లు పాలించి ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తుచేశారు. కరోనా సమయంలో అండగా ఉన్నాం, ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా ఆదుకున్నామన్నారు. గత పాలనలో రోడ్లు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మహబూబ్నగర్ను అన్నివిధాలా అభివృద్ధి చేశానన్నారు. గత పాలకులు రూ.200 ఫించన్ ఇస్తే, మేం వచ్చిన తర్వాత రూ.1,500 నుంచి రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చేశామన్నారు. ఆసరా ఫించన్ రూ.2,016 నుంచి రూ.5,016, దివ్యాంగుల ఫించన్ రూ.6,016 పెంచుతామని తెలిపారు. ప్రతి మహిళకు భృతి రూ.3వేలు, రైతుబంధు రూ.16వేలు, కేసీఆర్ బీమా రూ.5లక్షలు, ప్రతి ఇంటికి సన్నబియ్యం, అగ్రవర్ణాలకు నూతన గురుకులాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యలు తీర్చే నాయకుడికి అండగా ఉండాలన్నారు. మహబూబ్నగర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంత్రికి దివిటిపల్లి, అంబటిపల్లిలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, దివిటిపల్లి సర్పంచ్ జరీనాబేగం, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్ మండలం దివిటిపల్లిలో గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నరేశ్, విజయ్, రాజు, రవి, వంశీయాదవ్, శ్రీకాంత్తోపాటు 40మంది మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 19 : జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన బీజెపీ ఎస్సీ సెల్ మోర్చా జిల్లా నాయకుడు కృష్ణయ్య, అధ్యక్షుడు ఆంజనేయులుతోపాటు 50మంది, 19వ వార్డు టీచర్స్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, సౌజన్య, భార్గవి, అనూష, శ్రావణి, మమతతోపాటు 50మంది, వీరన్నపేట హీరాబాయి దాడితండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు విజయ్, రవినాయక్, గోవింద్నాయక్తోపాటు 100మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.