పెన్సిల్,పెన్ను.. పాలు..పెరుగు..జీఎస్టీకి కాదేదీ అనర్హం..ఆఖరికి శ్మశానాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అమాంతంగా పెంచిన మోదీ ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా పన్ను విధించి పేదల నడ్డి విరుస్తున్నది. ఓ వైపు వంటనూనెలు, పప్పుదినుసుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు కూడా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. చివరకు పాల పదార్థాలపై కూడా కేంద్రం జీఎస్టీ విధించి సావుదెబ్బ కొట్టింది. దీంతో ఏంకొని కుటుంబాన్ని పోషించాలి..ఏం తిని బతుకు బండిని ముందుకు లాగాలని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
పెబ్బేరులో ప్లకార్డులు, పాల క్యాన్లతో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
మహబూబ్నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధిస్తుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అమాంతంగా పెరగడంతో రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో నిత్యావసర వసువుల ధరలు భగ్గుమంటున్నాయి. వంటనూనెలు, పప్పుదినుసుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయలు ధరలు కూడా పెరిగిపోయాయి. ఇవన్నీ కాదని కేంద్రం పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధించింది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులు జీఎస్టీని అడ్డంపెట్టుకొని పన్నుల రూపేణా చారానా బదులు బారానా వసూలు చేస్తున్నారు. దీంతో పట్టణాల్లో టీ తాగిన కూడా జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో తక్కువ ధరకే దొరికే వస్తువులను వ్యాపారులు రోజుకో ధర చొప్పున విక్రయిస్తున్నారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయని పేదలు, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం వైఖరిపై మధ్యతరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 2014లో లీటర్ రూ.60 ఉన్న వంటనూనె.. ఇప్పుడు రూ.200కు చేరుకున్నది. రూ.70 ఉన్న పెట్రోల్ ఏకంగా రూ.110కి చేరింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా పేదల నడ్డీ విరిచేలా నిత్యావసర వస్తువుల ధరలను పెంచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రూ.410 ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1150కి పెంచిందని ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో పాలు, పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
సామాన్యులపై విషం కక్కుతున్న ప్రధాని
టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్
పాలప్యాకెట్లు, ఖాళీ క్యాన్లతో టీఆర్ఎస్ నాయకుల నిరసన
వనపర్తి, జూలై 21 : దేశంలోని బడాబాబులు సంపాదించే వాటిపై కాకుండా.. సామాన్యులు, పిల్లలు తాగే పాల ప్యాకెట్లపై విషం కక్కుతూ జీఎస్టీ విధించడం దారుణమని.., దేశాన్ని పా లించే పీఎం మోదీ పాలకుడా లేక సామాన్యుల రక్తం తాగే రాక్షసుడా అని టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ప్రశ్నించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్చౌరస్తాలో పా ల ప్యాకెట్లు, పాలక్యాన్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సామాన్య, పేదల నడ్డీ విరచడమే లక్ష్యంగా.., బడాబాబులకు కొమ్ము కాస్తూ పాలనను కొనసాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రి మోదీ అని విమర్శించారు. ఇష్టానుసారంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినా.. రైతులందరూ ఏకమై కేంద్రం మెడలు వంచినా సంగతి మరిచారా..?, ఉల్లిపాయ ధరలు పెంచితేనే ప్రభుత్వాలు మారిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. పాల ప్యాకెట్లు, పెరుగు, నోటు పుస్తకాలు, పెన్నులు వంటివాటిపై జీఎస్టీ పేరుతో సామాన్యులకు పెనుభారం మోపారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఏమీ తినలేం.. కొనలేం..
బీజేపీ సర్కార్ హయాంలో ఏమీ తినేలా లేదు.. కొనేలా లేదు.. గతంలో నెలవారీ ఖర్చులకు రూ.1200 అయ్యేది. కానీ, ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.2 వేలు అయినా సరిపోవడం లేదు. చిన్నపాటి ఉద్యోగాన్ని చేస్తూ జీవనాన్ని కొనసాగించే మా లాంటి మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటూపోతుంటే మధ్య తరగతి ప్రజలు దేశంలో ఉండాలా..? పారిపోవాలా..? అనేది కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – లత, గృహిణి, వనపర్తి
మధ్య తరగతి ప్రజలకు అవస్థలు..
కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకే జీఎస్టీ విధించిందనిపిస్తుంది. నిత్యావసరాలైన పెరుగుతోపాటు విద్యార్థులు ఉపయోగించే పెన్సిల్, బ్లేడ్స్పై జీఎస్టీ విధించడంతో తమలాంటి మధ్య తరగతి వారికి భారంగా మారుతున్నది. పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధించడం సరికాదు. కార్పొరేట్ సంస్థలకు, ధనిక వర్గాలకు ఇబ్బందులు కలగపోయినప్పటికీ, పేదలకు మాత్రం ఇబ్బందికరంగా మారనున్నది. బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బును విత్డ్రా చేసుకోవాలంటే కూడా 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి రావడం దారుణం. కేంద్ర ప్రభుత్వం కొన్నింటికైనా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి. – చంద్రకళ, అధ్యాపకురాలు, తెలకపల్లి
చాలా దారుణం..
కేంద్ర ప్రభుత్వం పాలపై జీఎస్టీ విధించం చాలా దారుణమైన చర్య. గతంలో ఏ ప్రభుత్వాలూ పాలపై పన్ను విధించిన సందర్భాలు లేవు. సిలిండర్, చమురు ధరలను పెంచి సాధారణ, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేశారు. అది సరిపోక ఇప్పుడు ప్రజలు నిత్యావసరంగా వినియోగించుకునే పాలపై జీఎస్టీ విధించారు. ఇలాంటి చర్యలను చూస్తుంటే కేంద్ర అవగాహన రాహిత్యం అర్థమవుతున్నది. పాలపై జీఎస్టీని బేషరతుగా విరమించుకొని ప్రజలకు అండగా నిలవాలి.
– పి.లక్ష్మీ, గృహిణి, కల్వకుర్తి
పెద్దల కడుపు నింపుతున్నది..
గతంలో ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే నెలకు రూ.3 వేలతో సరుకులు వచ్చేవి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులతోపాటు పాలు, ఇతర వాటిపై జీఎస్టీ విధించడంతో ధరలు ఆకాశానంటనున్నాయి. ఇది పేద, మధ్య తరగతి వారికి అదనపు భారం. ప్రస్తుతం రూ.5 వేలు పెట్టినా సరుకులు రావడం లేదు. కేంద్రం అనుసరిస్తున్న విధానం చూస్తుంటే పేదల కడుపు కొట్టి.. పెద్దల కడుపు నింపుతున్నట్లు ఉన్నది. కేంద్రం నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీ తొలగించాలి. – మానస, సంకాపురం, జోగుళాంబ గద్వాల జిల్లా
ధరలను అదుపు చేయాలి..
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా యి. జీఎస్టీ పేరుతో వివిధ రకాల వస్తువులపై పన్ను విధించడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. ధరల పెరుగుదలతో పేదల ఆర్థిక పరిస్థితి మ రింత దిగజారుతున్నది. కేంద్ర ప్రభుత్వం పెద్దపెద్ద కంపెనీలకు రాయితీలు కల్పిస్తూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డీ విరుస్తున్నది. నిత్యావసర సరుకులు కుటుంబానికి సరిపడా కొ నుగోలు కూడా చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా కేంద్రం పెరిగిన ధరలను తగ్గించాలి. – రేణుక, గృహిణి, సింగాయిపల్లి, కోడేరు మండలం