పాలమూరులో ప్రాపర్టీ షో జరగనున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో 14, 15వ తేదీల్లో నిర్వహించేందుకు ఏరాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర్శన్ ఫంక్షన్ హాల్లో షో ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు. ఒకే వేదికపై రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు, బ్యాంకులు, ఇతర నిర్మాణ సంస్థలు కొలువుదీరనున్నాయి. ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అవగాహన కల్పించేందుకు చక్కటి వేదికగా మారనున్నది. జిల్లా, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన ‘రియల్’ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సమగ్రంగా వివరించనున్నారు. మరోవైపు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఆఫర్లు ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నాయి.
– మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెంలగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ అంటే 2014కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్నగర్ పట్టణం ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పటికీ.. కనీసం తాగునీరు కూడా దొరకని ప్రాంతంగా అందరికీ సుపరిచితం. అందుకే ఈ పట్టణానికి కొత్త వాళ్లు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. ఏవైనా సంబంధాలు కలుపుకోవాలంటే మహబూబ్నగరా అని ఆరాలు తీసేవాళ్లు. ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఏ మాత్రం ఆసక్తి చూపించే వాళ్లు కాదు. పనిచేస్తున్న వాళ్లు కూడా గత్యంతరం లేక ఇతర ప్రాంతాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్లు.
ఇక రియల్ ఎస్టేట్ అనే మాటే ఎంతో కష్టంగా వినిపించేది. స్థలాల క్రయవిక్రయాలే పెద్దగా జరిగేవి కాదు. అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా మహబూబ్నగర్ దశ తిరిగింది. అప్పటి వరకు తాగునీటి కష్టాలు చవిచూసిన మహబూబ్నగర్ దశ తిరగడం ప్రారంభమైంది. 14 రోజులకోసారి వచ్చే తాగునీరు ఇప్పుడు నిత్యం మిషన్ భగీరథ శుద్ధ జలం అందే స్థాయికి చేరుకున్నది. విశాలమైన రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక వసతులు వచ్చేశాయి. సకల సదుపాయాలతో మహబూబ్నగర్ అలరారుతున్నది. దీంతో అప్పటి వరకు అయ్యో అన్నవాళ్లు ఇప్పుడు వావ్.. మహబూబ్నగర్ అనే విధంగా పరిస్థితిలో మార్పు వచ్చేసింది. గతంలో ఇక్కడ రూ.3 వేల లోపు గజం ధర పలికిన స్థలం ఇప్పుడు రూ.25 వేలకు పైగా దాటిపోయింది.
సమైక్య రాష్ట్రంలో మహబూబ్నగర్ నడిబొడ్డున ఉన్న స్థలాలకు పెద్దగా విలువ ఉండకపోగా.. ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో కొత్త కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీలు మహబూబ్నగర్ వచ్చి వ్యాపారాలు ప్రారంభించాయి. అన్ని అనుమతులు ఉన్న వెంచర్ల ద్వారా అనేక సంస్థలు వ్యాపారాలు ప్రారంభించాయి. ఎంతో అనుభవం ఉన్న భవన నిర్మాణ సంస్థలు సైతం మహబూబ్నగర్లో ఇండ్లు, అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయాలు చేస్తున్నారు. దీంతో అప్పటివరకు అద్దె ఇండ్లల్లో ఉన్న వాళ్లు కూడా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.
ఉద్యోగులకు బ్యాంకులు సరసమైన వడ్డీకే గృహ రుణాలు కూడా ఇస్తుండడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకున్నది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీకి అదనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా రావడంతో మహబూబ్నగర్ పట్టణంలో వైద్య పరంగా అవకాశాలు విస్తృతమయ్యాయి. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పెద్ద పెద్ద సంస్థలు సైతం మహబూబ్నగర్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. జడ్చర్ల వద్ద ఉన్న పోలేపల్లి సెజ్లో వేలాది మంది ఉద్యోగులు తమ నివాసాల కోసం జడ్చర్లతోపాటు మహబూబ్నగర్ పట్టణంపైనా ఆధారపడడంతో ఈ రెండు పట్టణాలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇటీవల రాజీవ్ స్వగృహ సారిక టౌన్ షిప్లో చాలా కాలంగా అమ్ముడుపోకుండా ఉన్న 240 ఓపెన్ ప్లాట్లకు వేలం వేయగా ఊహించని విధంగా గజం రూ.26,500 గరిష్ఠ ధర పలికాయి. దీంతో మహబూబ్నగర్, జడ్చర్ల రియల్ విలువ ఏంటో అందరికీ బహిర్గతమైంది.
అద్భుతమైన రవాణా సదుపాయాలు..
మహబూబ్నగర్ పట్టణానికి ఒకప్పుడు మోస్తరు రవాణా సదుపాయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు క్రమంగా పరిస్థితి మారింది. మహబూబ్నగర్ మీదుగా బళ్లారి నుంచి కోదాడ వరకు ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా మార్చే ప్రక్రియ పట్టణంలో దాదాపుగా పూర్తయింది. దీంతో మహబూబ్నగర్ నుంచి జడ్చర్లకు కేవలం 10-15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వరకు ఉన్న 10 కి.మీ రోడ్డు కూడా దాదాపుగా 4 వరుసల విస్తరణ పూర్తయింది. దీంతోపాటు మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖాన నుంచి భూత్పూర్ రోడ్డు వరకు నిర్మించిన బైపాస్ రోడ్డు పట్టణానికి మణిహారంగా మారింది. ఈ బైపాస్ వెంట 5 కి.మీ మేర అనేక వెంచర్లు ఏర్పాటయ్యాయి. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునేందుకు ఈ బైపాస్ ఎంతో ఉపయోగంగా మారింది. ఈ బైపాస్ నుంచే చించోళి హైవే పనులకు సైతం ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ హైవే పూర్తయితే ఇక రియల్ ఎస్టేట్ పరంగా మహబూబ్నగర్ మరింత కొత్త పుంతలు తొక్కనున్నది.