యమడ్రింకర్లూ పారాహుషార్.. మద్యం తాగి వాహనాలు నడిపితే మీ పని అయినట్లే.. విస్తృతంగా తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్లతో పోలీసులు సిద్ధంగా ఉంటున్నారు. 30 మిల్లీగ్రాముల ఆల్కహాల్ మోతాదు దాటి పట్టుబడితే జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తున్నారు. 11 నెలల్లోనే 6,270 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రూ.7.45 కోట్ల జరిమానాలు విధించారు. ప్రమాదాల నివారణకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 17 : ‘ఒక్క బీరు మాత్రమే తాగిన.. రెండు పెగ్గులే వేశాను.. ఇంత శాతం ఎలా వచ్చింది..’ ఇది సాధారణంగా మద్యం తాగి పోలీసులకు పట్టుబడినప్పుడు జరిగే చర్చ. 30 మిల్లీగ్రాముల మద్యం మోతాదు దాటితే కేసు నమోదుచేస్తారు. శారీరకంగా బలంగా ఉంటే ఒక రకంగా.. బలహీనంగా ఉంటే మరో రకంగా ఎంజీ నమోదవుతుంది. ఇది తెలియక చాలా మంది కొద్దిగానే తాగాం కదా అని వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు.
జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నది. జిల్లా కేంద్రాలు, పట్టణా లు, జాతీయ రహదారులపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో మద్యం తాగి ఎక్కువ మంది వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రమాదాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీస్శాఖ హెచ్చరిస్తున్నది. అయినా మాట వినకుండా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 2022 జనవరి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు 6,270 మందిపై కేసులు నమెదు కాగా, రూ.7,45,08,713 జరిమానాలు విధించారు.
చట్టాలు కఠినతరం..
మద్యం తాగి పట్టుబడే వారి విషయంలో న్యా యస్థానాలు కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. 30 మిల్లీగ్రాముల మద్యం మెతాదు మించితే జరిమానాతోపాటు రెండు నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. మద్యం మోతాదును బట్టి రూ.2,100 నుంచి రూ.2,500 వరకు ఫైన్ వేస్తున్నారు. అయితే, మొదటిసారి పొరపాటు జరిగిందని.. మరోమారు ఇలా చేయమని పైస్థాయి కోర్టులకు వెళ్లినా.. ఇదే శిక్షను అమలుచేస్తూ తీర్పు వస్తున్నది.
ఒక్క బీర్ తాగినా..
ఒక్క బీరులో సాధారణంగా 750 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. బీరు రక్తంలో కలిసిపోతే బీఏసీ శాతం 40-50గా నమోదవుతుంది. బీరు తాగిన గంటలోపు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కితే జైలు పాలు కాక తప్పదు. బీరు తాగిన గంట త ర్వాత పోలీసులకు పట్టుబడితే బీఏసీ శాతం 30 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఒక్క బీరు తాగి వాహనం నడిపినా పట్టుబడతామన్న విషయాన్ని గుర్తించాలి. కానీ, నేడు యువత మోతాదుకు మించి మద్యం తాగుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో నిర్వహించే తనిఖీల్లో ఎక్కువగా దిగువ మధ్య తరగతివారే పట్టుబడుతున్నారు. వీరిలో చాలా మంది చిప్ లిక్కర్ తీసుకుంటున్నారు. ఎక్కువ ధర గల మద్యం కంటే.. చీప్ లిక్కర్లో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటుంది. దీంతో శ్వాస పరీక్ష నిర్వహించినప్పుడు బీఎసీ శాతం ఎక్కువగా నమోదవుతున్నది.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు..
మద్యం తాగి ఎ ట్టి పరిస్థితుల్లో వా హనాలు నడపొద్దు. తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. జరిమానాతో జైలుపాలు కాక తప్పదు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించుకుంటున్నాం. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేస్తాం.
– వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్నగర్