కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహాలో ఈ పథకం కూడా ప్రారంభానికి ముస్తాబవుతోంది. దీంతో సమైక్య పాలనలో బీడు భూములతో, కరువు ఛాయలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం మరో కోనసీమగా మారబోతోంది. ఫలితంగా ఉమ్మడి పాలమూరులో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ఇందుకోసం పనులు చకచకా సాగుతున్నాయి. అంజనగిరి సమీపంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ జీరో పాయింట్ నుంచి నీటిని తీసుకొచ్చి గేట్లు.. టన్నెల్స్ మీదుగా సర్జ్పూల్.. పంపింగ్ యూనిట్కు తరలిస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం బాహుబలి మోటర్లకు మించి.. 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఒక్కో మోటర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తాయి. ఇందుకోసం మొత్తం8+1 మోటర్ల (ఒకటి ప్రత్యామ్నాయంగా)ను బిగించారు. 16వ తేదీన వెట్న్న్రు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే డ్రైరన్ విజయ వంతం కావడంతో ఇంజినీర్లు, అధికారులు రెట్టింపు ఉత్సాహంగా పనులు చేపడుతున్నారు. నార్లాపూర్లో ఒక్కో మోటర్ 85 క్యూసె క్కులను, మిగిలిన లిఫ్టుల్లో 75 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయనున్నాయి. ఇలా రోజుకూ 1.5 టీఎంసీల చొప్పున శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
– నాగర్కర్నూల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలాలు త్వరలో అందనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాపై ఉన్న ప్రేమను ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో మరోసారి చాటబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావంతో పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐని పూర్తి చేయించడంతో పాటుగా భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయించారు. అయితే కరువును శాశ్వతంగా పారదోలేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రూ.50 వేల కోట్లతో చేపట్టారు. గతంలో 2.50 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించే ఎంజీకేఎల్ఐని నాటి పాలకులు దశాబ్దానికిపైగా పెండింగ్లోనే ఉంచారు. అలాంటిది 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతలను దశాబ్దంలోపే పూర్తి చేయడం విశేషం. దీనికి కాంగ్రెస్తో పాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంకిగా మారినా సీఎం కేసీఆర్, ఇంజినీయర్ల కృషితో అధిగమించడం గమనార్హం.
పాలమూరు ప్రాజెక్టు పనుల్లో కీలకమైన డ్రైరన్ ఈనెల 3వ తేదీన విజయవంతమైంది. దీంతో అధికారులు, ఇంజినీర్లు మరింత ఉత్సాహంగా పనులు చేస్తున్నారు. నిర్ణీత సమయంలోగా నీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బిగించిన మోటర్లను మించి ఉండడంతో నీటి ఎత్తిపోతల శరవేగంగా జరగనున్నది. ఇక ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటంతో పాలమూరు మరో కోనసీమగా మారనున్నది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో సాగునీరు అందని భూములకు ఈ ప్రాజెక్టుతో కృష్ణా జలాలు అందనున్నాయి. ఫలితంగా రాబోయే కాలంలో సాగునీటికి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. బీడు భూముల్లో కృష్ణమ్మ జలతాండవం చేసి పచ్చని మాగాణుల్లా మార్చనున్నది. మొత్తం మీద ఈ యాసంగికే పాలమూరు ఎత్తిపోతలతో సాగునీళ్లు ఉమ్మడి జిల్లాలోని భూములను తాకనుండటం విశేషం. దీంతో పాలమూరు ప్రజలంతా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఈనెల 16వ తేదీన సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద లిఫ్టు పనులను ప్రారంభిస్తారు. ఇలా 8.51 టీఎంసీల సామర్థ్యమున్న నార్లాపూర్ జలాశయం నుంచి రెండు వారాల్లో ఏదుల (6.55టీఎంసీలు)కు.. అక్కడి నుంచి వట్టెం (16.74టీఎంసీలు)కు నీటిని ఎత్తిపోస్తారు. ఇలా నార్లాపూర్ నుంచి కరివెన(17.34టీఎంసీలు)కు 45 రోజుల్లో విడుతల వారీగా నీటి పంపింగ్ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోనూ దాదాపుగా 70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం అవుతుండగా, యాసంగి నాటికి పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్లూరు రిజర్వాయర్లో 8+1 మోటర్లు ఉండగా.. ఏదుల, వట్టెం రిజర్వాయర్లలో 9+1 మోటర్లను బిగించారు. వీటిలో ఒక మోటర్ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. వెట్న్ నాటికి ఆయా లిఫ్టుల వద్ద రెండు చొప్పున పంపులను సన్నద్ధం చేయనున్నారు. ఈ లిఫ్టుల్లో ఒక్కో మోటర్ సామర్థ్యం 145 మెగావాట్ల హార్స్పవర్ సామర్థ్యం ఉన్నవి. నార్లాపూర్లో ఒక్కో మోటర్ 85 క్యూసెక్కులను, మిగిలిన లిఫ్టుల్లో 75 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయనున్నాయి. ఇలా రోజుకూ 1.5 టీఎంసీల చొప్పున శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా ప్రాజెక్టు అందుబాటులోకి రానుండడం విశేషం.
పాలమూరు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన ఐదు రిజర్వాయర్లు జలకళను సంతరించుకోనున్నాయి. నార్లాపూర్(కొల్లాపూర్), ఏదుల(వనపర్తి), వట్టెం(బిజినేపల్లి-నాగర్కర్నూల్), కరివెన (మహబూబ్నగర్) రిజర్వాయర్లకు అక్టోబర్లో సాగునీరు అందే అవకాశం ఉన్నది. అనంతరం ఉదండాపూర్కు కృష్ణా జలాలు పరుగులు పెట్టనున్నాయి. ప్రణాళిక మేరకు నీటిని అందించేలా అధికారులు, ఇంజినీర్లు అడుగులు వేస్తున్నారు. త్వరలో సాగునీటి సంబురం నెలకొననుండడంతో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
త్వరలో వెట్న్ నిర్వహించనుండడంతో ఇంజినీర్లు పనుల్లో మరింత వేగం పెంచారు. ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో మొదటిదైన నార్లాపూర్-అంజనగిరి రిజర్వాయర్ (8.51టీఎంసీలు)ను 2 టీఎంసీలతో నింపనున్నారు. అక్కడి నుంచి ఏదుల పంపుహౌస్కు నీటిని తరలిస్తారు. ఇలా అక్టోబర్ మొదటి వారంలోనే ఏదుల రిజర్వాయర్ను 2 టీఎంసీలతో నింపనున్నారు. అక్కడి నుంచి వట్టెం, ఆపై కరివెన రిజర్వాయర్లను కూడా 2 టీఎంసీల చొప్పున 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. చైనా, యూరప్ దేశాల్లో కూడా లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేసిన మోటర్లను ఈ ప్రాజెక్టులో బిగించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనుల్లో భాగంగా అప్రోచ్ చానళ్లు, సర్జ్పూల్స్, సొరంగాలు, రిజర్వాయర్లు, కాల్వలు అలాగే 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కూడా దాదాపుగా తుది దశకు చేరాయి.
ప్రాజెక్టు మొదటి దశలో పనులతో ఉమ్మడి పాలమూరుతో పాటుగా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 70 మండలాల్లోని 1,546 నీటి కుంటలు, చెరువులు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తాగునీటికి, పరిశ్రమలకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందనున్నాయి. ఇలా బహుముఖ ప్రయోజనాలతో చేపడుతున్న ప్రాజెక్టు పదేళ్లలోపే తుది దశకు చేరడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దశాబ్దంలోపే 40కిపైగా కేసులను ఎదుర్కొని పూర్తి చేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, ఇంజినీర్లకే దక్కుతున్నది. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుండగా అంతకుమించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖచిత్రం మారనున్నది.
నాడు దగాపడ్డ పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చలవతో ధాన్యాగారంగా మారుతున్నది. రిజర్వాయర్లతో పరిసర ప్రాంతాల్లోనూ భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లోనూ తక్కువ మట్టంలోనే బోర్లలో నీళ్లు వచ్చే అవకాశం ఎన్నది. దీనివల్ల ఇటు పంటలతో రైతులు, అటు తాగునీటితో ప్రలంతా సంతోషాలను చవిచూడబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావంలో తొలి విడుతలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు వచ్చే యాసంగి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుండటంతో ప్రజ ల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనుండటంతో సెప్టెంబర్ 16 పాలమూరు ప్రజలకు పండుగ రోజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నది. ఇందులో భాగంగా కొల్లాపూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోనున్నారు.
సీఎం కేసీఆర్తో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతున్నది. పాలమూరు ప్రజలపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉంది. పాలమూరు ప్రజల ఓట్లను చెప్పుకొని నాటి పాలకులు అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ మాత్రం జిల్లాలోని కరువును దూరం చేశారు. నాటి పాలకులు కన్నీళ్లు మిగిలిస్తే సీఎం కేసీఆర్ కృష్ణా నీళ్లను తెప్పించారు. సీఎంగా కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కావడం సంతోషకరం. ఈ సందర్భంగా కొల్లాపూర్లో జరిగే సభకు ప్రజలు పెధ్ద ఎత్తున తరలిరావాలి.
– మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్కర్నూల్