మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ అన్నారు. వైద్యారోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాతాశిశు సంరక్షణ సేవలను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. గర్భిణులను మూడునెలలోపు గుర్తించి నమోదు చేయాలని సూచించారు. ప్రతి గర్భిణికి నెలలో రెండుమారు పీహెచ్సీ డాక్టర్తో, మరో రెండుమార్లు నిపుణులైన వైద్యులచే ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. గర్భిణిలో ప్రమాదకర లక్షణాలను గుర్తించాలని తెలిపారు. ముఖ్యంగా రక్తహీనత లక్షణాలు ఉంటే కొత్తగా వచ్చిన ఐరన్ ఫోలిక్క్యాప్సల్స్ను వాడేలా చూడాలన్నారు. అలాగే ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు చేయాలని సూచించారు. మాతాశిశు మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్వో సరస్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో శశికాంత్, డీఐవో శంకర్, పీవోఎంహెచ్ఎన్ భాస్కర్నాయక్, టీడీసీవో రఫీక్, డెమో డాక్టర్ తిరుపతిరావు, డీఎం విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.
కాన్పుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేవిధంగా వైద్యసిబ్బంది కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖాన వార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. దవాఖానకు వచ్చే గర్భిణులకు సాధ్యమైనంతవరకు సాధారణ కాన్పు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అర్హులైన ప్రతిఒక్కరికీ కేసీఆర్ కిట్ అందజేయాలని పేర్కొన్నారు. దవాఖానకు వచ్చేవారికి మెరుగైన వైద్యం అందిస్తే రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధినిర్వహణలో అలసత్వం వహించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దవాఖాన రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, డాక్టర్లు భాస్కర్నాయక్, విజయలక్ష్మి, సిబ్బంది కళమ్మ, రాఘవేందర్, అవినాశ్, వినోద, సువార్త తదితరులు పాల్గొన్నారు.