గులాబీ దళపతి రాకతో ఉమ్మడి జిల్లా పరవశించనున్నది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జి ల్లాలో ఆదివారం ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం అలంపూర్, కొల్లాపూర్, సాయంత్రం నాగర్కర్నూల్, కల్వకుర్తిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అధినాయకుడికి జేజేలు పలికేందుకు శ్రేణులు సన్నద్ధమవగా.. లక్షల సంఖ్యలో జనసమీకరణ, ఏర్పాట్లలో అభ్యర్థులు, నాయకులు నిమగ్నమయ్యా రు. జననేతకు నీరాజనం పలికేందుకుగానూ జన సునామీని నాలుగు సెగ్మెంట్లకు తీసుకురానున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్ యాదవ్ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. పోలింగ్కు ఇంకా 12 రోజుల సమయం మాత్రమే ఉండడంతో కనీవినీ ఎరుగని రీతిలో పర్యటనను సక్సెస్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా 22న పాలమూరుకు సీఎం కేసీఆర్ రానున్నారు. అన్ని పార్టీల ముఖ్య నాయకుల పర్యటనతో రాజకీయం వేడెక్కింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
మహబూబ్నగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈనెల 19న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమరం జోరందుకున్న తరుణంలో ఏకంగా నాలుగు నియెజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వత ప్రచారం జోరందుకున్న తరుణంలో గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో చేపట్టిన ప్రజాఆశీర్వద సభలు కీలకంగా మారాయి.
ఎన్నికలకు ఇంకా సరిగ్గా 12 రోజులే మిగిలి ఉన్నది. అన్ని పార్టీల అధినేతల పర్యటనలతో రాజకీయం వేడిక్కింది. ఆయా పార్టీలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కేసీఆర్ అలంపూర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పర్యటన ఆత్యంత ప్రధాన్యతను సంతరించుకున్నది. బీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అలంపూర్లో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చారు. నాగర్కర్నూల్, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్తో దోస్తీ కట్టారు. కొల్లాపూర్లో పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్కు గురయ్యారు. వీరంతా కాంగ్రెస్ పంచాన చేరి బీఆర్ఎస్నే ఢీకొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు సభలు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పటికే ప్రచార హోరు తారాస్థాయికి చేరుకున్నది.
అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకంలో ప్రవేశించిన దశలో ప్రగతి ప్రదాత కేసీఆర్ ఏకంగా మరోసారి నాలుగు సభల్లో పాల్గొనబోతున్నారు. ఈనెల 6న నాలుగు సభలకు హాజరుకావడంతో శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. తాజాగా మరో నాలుగు సభలతో కేసీఆర్ ఏకంగా 11 నియోజకవర్గాలను కవర్ చేసినట్లు అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రజా ఆశీర్వద సభలకు జనం పోటెత్తారు. ఈసారి కూడ నాలుగు చోట్ల సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు శ్రమిస్తున్నారు. అలంపూర్లో ఎమ్మెల్సీ చల్లావెంకట్రామిరెడ్డి అన్ని తానై వ్యవహరిస్తూ అధినేత పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రజా ఆశీర్వద సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేలా జనాలను తరలించే ప్లాన్లో ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో కూడా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీ శ్రేణులను కలుపుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. 22న మహబూబ్నగర్లో జరిగే ప్రజా ఆశీర్వద సభలో కేసీఆర్ వస్తుండటంతో 12 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినట్లు అవుతుంది. జననేత పాల్గొనే సభలను గ్రాండ్ సక్సెస్ చేసే రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి బీఆర్ఎస్ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఈమేరకు 12 నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో తుది దశకు చేరుకున్న అసెంబ్లీ సమరం మరింత రసవత్తరంగా మారింది. కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో గులాబీ దళంలో జోష్ పెరిగింది. ప్రగతి ప్రదాత రాకతో గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయని, ప్రజలు కేసీఆర్ను ఆదరిస్తారన్న ధీమాలో ఉన్నారు. పదేండ్లలో పాలమూరు ప్రగతిని పరుగులు పెట్టించారు.. పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రతి కార్యక్రమాన్ని కాదనకుండా మంజూరు చేశారు. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమ పథకాలతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. కండ్లముందే కనిపిస్తున్న ప్రగతి, ఇంటింటికీ అందుతున్న పథకాలతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను నమ్మే స్థితిలో జనం కనిపించడం లేదని తేటతెల్లమవుతుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు తుదిదశలో కేసీఆర్ దేఖ్లేంగే అనే సవాల్ విసురుతూ ప్రజాఆశీర్వద సభలతో విపక్షాలకు ఝలక్ ఇస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తెలంగాణపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, రైతులపై చేస్తున్న కామెంట్లు హాట్టాపిక్గా మారాయి. ఈ తరుణంలో జరిగే ప్రచార సభలు మరింత ఎన్నికల వేడిని రగిలిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరోసారి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. ఏకంగా నాలుగు చోట్ల ప్రజాఆశీర్వద సభలు పెట్టి పార్టీ నేతలు తమ తడాఖా చూపించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అలంపూర్ జోగుళాంబ దేవి సాక్షిగా ప్రజాఆశీర్వద సభ ప్రారంభం కానున్నది. హెలికాప్టర్లో ఇక్కడకు చేరుకోనున్నారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అనుచరుడు విజయుడుకు బీఫాం అందించారు. తర్వాత అన్నీ తానై సభను విజయవంతం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ తరుణంలో ఇక్కడ సభ ముగించుకొని సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు కొల్లాపూర్ చేరుకుంటారు. పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి నేతృత్వంలో సభ జరగనున్నది. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు నాగర్కర్నూల్లో జరిగే ప్రచార సభలో పాల్గొనున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా జనాన్ని తరలించే పనిలో శ్రేణులు నిమగ్నమయ్యారు. కల్వకుర్తిలో జరిగే సభ చివరిది. సాయంత్రం 5 గంటలకు చేరుకుని ఇక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రజాఆశీర్వద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్కు పోటీగా.. పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై.. నేడు కాంగ్రెస్ టికెట్తో ఎన్నికల రంగంలోకి దిగడంతో ఇక్కడ కేసీఆర్ సభ ప్రతిష్టాత్మకంగా మారింది.