అచ్చంపేట, అక్టోబర్ 27: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాల్గొన్న అచ్చంపేట ప్రజాఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అచ్చంపేట నలువైపులా ఎటుచూసినా జనం.. గులాబీ ప్రభంజనాన్ని తలపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ఆశీంచిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజానీకం తరలిరావడంతో అచ్చంపేట గులాబీవనాన్ని తలపించింది. ఈ సభ ద్వారా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి మరింత గ్రాఫ్ పెరిగింది. పదేండ్లలో కళ్లరా కనిపిస్తున్న అభివృద్ధిని చూస్తున్న నల్లమల ప్రజానీకం మూడోసారి సీఎం కేసీఆర్ను దీవించి సీఎం సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించేందుకు మహిళలు, యువత, అభిమానులతోపాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అచ్చంపేట చరిత్రలో ఇంతపెద్ద సభ ఏప్పుడు జరుగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరి నోటవిన్న ఏం సభ, ఇంతమంది వస్తారని అనుకోలేదు, అచ్చంపేట మొత్తం జనాలతో నిండిపోయింది, ఇక బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరనే చర్చించుకుంటున్నారు. రాజకీయ అనుభవం ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, రాజకీయ పార్టీలు ఎక్కడ నలుగురు కలిసినా ఈ సభ గురించే చర్చించుకోవడం వినిపించింది. సభకు వచ్చి వెళ్లిన వారు గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో ఈ సభ గురించే మాట్లాడుకోవడం కనిపించింది.
అచ్చంపేటలో సీఎం కేసీఆర్ సభ ద్వారా అచ్చంపేటలో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగినట్లు ఇంటెలిజెన్స్వర్గాలు తెలిపాయి. సభను చూసిన తర్వాత ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డారని అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సభకు వచ్చే వారి సంఖ్యను చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోవడం లేదు. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల ఓటమి భయం పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు గల్లలు ఎగిరేసిన ప్రతిపక్షాలు సభ చూసిన జనాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ విజయం తేలిపోయింది. మరోసారి అచ్చంపేటలో కాంగ్రెస్ ఖతం కానున్నదని తెలుస్తోంది. జనం స్పందన బట్టి బీఆర్ఎస్ గెలుపును ఆపేశక్తి ఎవరికీ లేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు భయపడి గ్రామాల నుంచి సభకు ఎంతమంది, ఎవరెవరు వెళ్లారనేది ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అచ్చంపేట కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడడంతోపాటు పునరాలోచన చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనడానికి సభకు వచ్చిన జనమే నిదర్శనంగా చెప్పవచ్చు. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, తండాలు, గూడేల్లో బీఆర్ఎస్కు ఆదరణ మరింత పెరిగింది. అచ్చంపేట సభకు వేలాదిగా తరలివచ్చిన జనం ఎండను సైతం లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ ప్రసంగం మొత్తం ఈలలు, కేకలు, కేరింతలతో జోష్గా సాగింది. సభకు వచ్చిన వారందరూ ఎంత జోష్తో ఉత్సహంతో ఉన్నారో దీనినిబట్టి తెలిసిపోయింది. అచ్చంపేట గడ్డపై మూడోసారి గులాబీ జెండ ఎగురడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అచ్చంపేటలో మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా మారడంతో కొందరు ముఖ్యులు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారిలో కొందరు అంతర్మథనంలో పడ్డారు. అనవసరంగా బీఆర్ఎస్ను వీడినట్లు మధనపడుతున్నారని తెలిసింది. ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న స్పందన చూసిన తర్వాత ప్రతిపక్షాల క్యాడర్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. కొందరు కాంగ్రెస్లో వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. అయితే కొందరు బీఆర్ఎస్ నేతలు వారిని పార్టీలోకి తీసుకోవద్దని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఫారం తీసుకొని అచ్చంపేట వచ్చిన సందర్భంగా దాదాపు పదివేల మందితో చేపట్టిన భారీ బైక్ర్యాలీ, సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభను చూసిన తర్వాత ప్రతిపక్ష నేతలు పునరాలోచనలో పడ్డారు. ఇక కాంగ్రెస్లో పనిచేసినా అనవసరమని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులే హోటళ్లు, టీస్టాల్స్, నలుగురు కలిసిన దగ్గర కాంగ్రెస్ గెలువదని చెబుతున్నారంట. ఇంతకుముందు ఏదో అనుకున్నామని, కానీ సభకు వచ్చిన ప్రజలను చూసిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని మధనపడుతున్నారని తెలిసింది.
సీఎం కేసీఆర్ అచ్చంపేటకు వరాలు ప్రకటించడంతో ప్రజల్లో మరింత విశ్వాసం పెంచింది. గతంలో అచ్చంపేటను ఏ పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అభివృద్ధి కూడా కండ్లముందు కనిపిస్తోంది. అప్పర్ప్లాట్కు చివరలో ఉన్న మద్దిమడుగుకు కూడా ఇంటింటికీ మీషన్భగీరథ జలాలు అందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంతోపాటు అచ్చంపేటకు సాగునీళ్లు అందించే ప్రక్రియ మొదలు పెడుతానని గత ఎన్నికల సందర్భంలో సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అప్పర్ప్లాట్ సాగునీటి పథకాన్ని రూపకల్పన చేసి ఎత్తిపోతల పథకం పనులు ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రజల్లో మరింత విశ్వాసాన్ని నింపింది. మరోసారి ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అచ్చంపేటకు మహిళా డిగ్రీ గురుకుల కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జీవో మంజూరు చేస్తానని ప్రకటించడంతో సభీకుల నుంచి మద్దతు లభించింది. అదేవిధంగా ఉమామహేశ్వరం, మల్లెలతీర్ధం, సలేశ్వరం ఇతర పుణ్యక్షేత్రాలను పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేస్తామని, అప్పర్ప్లాట్కు సాగునీరు అందించే బాధ్యత నాదేనని ప్రకటించారు. నియోజకవర్గవ్యాప్తంగా దళితబంధు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈవిధంగా అచ్చంపేటకు వరాలు కురిపించడంతో అచ్చంపేట ప్రజానీకం పులకించిపోయారు. ప్రజలు ఆశీంచిన అభివృద్ధి జరుగుతుండడంతోపాటు వరాలు ప్రకటించి అచ్చంపేటను మరింత అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా సీఎం కేసీఆరే స్వయంగా హామీ ఇవ్వడంతో ప్రజల్లో మరింత విశ్వాసం పెంచింది. అచ్చంపేటలో ఇవన్నీ రావాలంటే ముందు గువ్వల బాలరాజును గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రజలకు ధన్యవాదాలు
అచ్చంపేట సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు ప్రజానీకం ఊహించినదానికన్న రెట్టింపు స్థాయిలో వచ్చి విజయవంతం చేశారు. ఎండను లెక్కచేయకుండా ప్రజల స్వచ్ఛందంగా రావ డం మాకు మరింత బలాన్నిచ్చింది. సభలో ప్రజలు చూపించిన ఉత్సాహాన్ని చూసిన తర్వాత మూడోసారి అచ్చంపేటలో 50వేల మెజారీతో గెలువడం ఖాయమని తేలిపోయింది. ఇక అచ్చంపేట గెలుపును ఆపే దమ్ము ఏ పార్టీకి లేదు. ప్రజలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అచ్చంపేటకు సాగునీరు అందించి తీరుతా.. సభను విజయవంతం చేసిన ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, వృద్ధులు, మైనార్టీలు, గిరిజనులు, బంజారులు, దళితులకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.