మహబూబ్నగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఆర్ఎల్ఐ ఊసే లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ నేతల వైఫల్యం వల్లే అటు రాష్ర్టానికి, ఇటు జిల్లాకు ఒక్క ప్రయోజనం చేకూరలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పొరుగునే ఉన్న కర్ణాటకకు వరాల జల్లు కురిపించిన కేంద్రం.. తెలంగాణకు నిరాశ మిగిలించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందనడానికి ఇదే నిదర్శమని ఆరోపిస్తున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విద్యాసంస్థలను కూడా కేటాయించలేదు. సామాన్యుడు ధరల మోత భరించలేక సతమతమవుతుంటే.. ధరలు తగ్గించే ఆలోచన చేయకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి కర్నూల్ వరకు డబ్లింగ్, దేవరకద్ర-కృష్ణ రైల్వేలైన్కు నయాపైసా ఇవ్వలేదు.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం.. తెలంగాణకు అన్యాయం చేయడం చూస్తుంటే కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నది స్పష్టమవుతుందని ప్రజలు చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నా దానిని పెడచెవిన పెట్టి.. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు సమీకరిస్తామని కేంద్రం ప్రకటించడం సిగ్గుచేటని అంటున్నారు. ఈసారి పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా వస్తుందని బీజేపీ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.5వేల కోట్లు విడుదల చేయడం.. తెలంగాణకు నయాపైసా ఇవ్వకపోవడంపై పెదవివిరుస్తున్నారు. కృష్ణాజలాల్లో నీటి వాటా తేల్చకుండా కేంద్రం తాత్సారం చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసులు వేస్తూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన నారాయణపేట, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కావాలని డిమాండ్ చేస్తున్నా.. బడ్జెట్లో వాటి గురించి ప్రస్తావనే లేదు. ప్రతి జిల్లాలో ఈ విద్యా సంస్థలు స్థాపించాలని కేంద్రం గైడ్లైన్స్ ఉన్నా.. కొత్త జిల్లాలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. నారాయణపేట జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నది. ప్రభుత్వ స్థలం కూడా అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదు. దీంతో ఈసారి కేంద్ర బడ్జెట్లో నిరాశే మిగిలిందని ఉమ్మడి జిల్లా వాసులు చెబుతున్నారు.
కేంద్రం తెలంగాణపై పూర్తి స్థాయిలో కక్ష సాధిస్తుందనడానికి పార్లమెంట్ సా క్షిగా ప్రవేశపెట్టిన బ డ్జెటే నిదర్శనం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. రాష్ర్టానికి ఏం కేటాయించలేదు. ఇదేం ప ద్దు. కేంద్రం 157 నర్సింగ్ కళాశాలలు మం జూరు చేసింది. కానీ రాష్ర్టానికి ఒక్కటీ రా లేదు. గతంలో 157 మెడికల్ కాలేజీలు ఇ చ్చింది.. అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఫార్మా యూనివర్సిటీ కావాలని అడిగినా ఇ య్యలేదు. నారాయణపేటకు సైనిక్ స్కూ లూ రాలే. పక్కనే ఉన్న కర్ణాటకకు అన్నీ ఇచ్చి.. తెలంగాణకు అన్యాయం చేసింది.
– ఎస్.రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నారాయణపేట