రైతులకు నకిలీ విత్తనాల బెడద
వ్యవసాయ, పోలీసు శాఖల తనిఖీలు
రసీదులు తీసుకోవాలంటున్న అధికారులు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
వనపర్తి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే ప్రమాదమున్నది. నమ్మకమున్న వ్యాపారస్తుడే అని గుడ్డిగా నమ్మితే.. నష్టాలను చవిచూడాల్సి వచ్చే అవకాశమున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నాహమవుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొందరు డీలర్లు నకిలీ విత్తనాలతోపాటు ఎరువులను విక్రయిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. విత్తనాల ఎంపిక నుంచి దిగుబడి వరకు శాస్త్రీయ పద్ధతులను వాడాలని అధికారులు చెబుతున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణతోపాటు వాటిని విక్రయించే వ్యాపారుల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయాధికారులు తనిఖీలు చేపడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలిస్తూ అండగా నిలుస్తున్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్..
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించినా.. అక్రమార్కులు రైతులను మభ్యపెడుతూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతుల వద్దకే వెళ్లి.. కొత్తగా వచ్చిన కంపెనీ విత్తనాలు వాడితే మంచి దిగుబడి వస్తుందని నమ్మబలికి విక్రయిస్తున్నారు. వీరిని గుడ్డిగా నమ్మిన రైతులు పంట దిగుబడి సరిగ్గా రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిఘాను పెంచింది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీంలను రంగంలోకి దించింది.
ప్రత్యేక బృందాలతో నిఘా..
నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నిఘా పెంచాం. ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. జో గుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని అన్ని దుకాణాల్లో తనిఖీలు చేశాం. కాలం చెల్లిన విత్తన ప్యాకెట్లు స్వాధీనం చే సుకున్నాం. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్య లు తీసుకుంటాం. అదే పనిగా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న డీలర్ వద్దే కొనుగోలు చేయాలి. లూజ్గా లేదా బట్ట సంచుల్లో అమ్మేవారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు. విత్తనాల ప్యాకెట్ను వాడి పడేయొద్దు. రసీదుతోపాటు ప్యాకెట్ను కూడా దాచిపెట్టాలి. నకిలీవైతే న్యాయపరంగా పోరాటం చేసి నష్ట పరిహారం పొందొచ్చు. – జే.రంజన్త్రన్ కుమార్, ఎస్పీ, వనపర్తి
రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు..
* వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి.
* విత్తన ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు గమనించాలి.
* సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
* కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పకుండా తీసుకోవాలి. రసీదుపై డీలర్ సంతకంతోపాటు స్టాంపు ఉండేలా చూసుకోవాలి.
* విత్తనాలు కొనేముందు వ్యవసాయాధికారి శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి.
* రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తన సంచులపై నీటి రంగు ట్యాగ్ ఉంటేనే కొనుగోలు చేయాలి.
* లేబులు విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ట్యాగ్ కట్టి ఉంటుంది. సంచిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. వీటి విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. డీలర్ల నుంచి సరైన బిల్లు తీసుకోవాలి
* చాలా మంది డీలర్లు తెల్లటి చీటీపై బిల్లు ఇస్తారు. దీనిని తీసుకోవద్దు. రసీదుపై డీలరు లైసెన్స్ నంబర్, దుకాణం పేరు, ఫోన్ నెంబర్ ఉంటేనే తీసుకోవాలి.
* బ్రిడిల్ విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన సంచికి పసువురంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి.
* పంట దిగుబడి వచ్చేవరకు విత్తన రసీదులు భద్ర పరుచుకోవాలి.
* విత్తనాలు సరైనవీ విత్తుకున్నప్పటికీ ఎరువులు, పురుగుమందులు నాసిరకం అయితే పంట దెబ్బతింటుంది.
* డీలర్ బుక్లో ఎరువులు తీసుకున్న సమయంలో రైతులు సంతకం చేయాలి. దీన్ని మరువద్దు.
* ఒరిజినల్ రసీదు అడిగితే డీలరు జాగ్రత్త పడుతారు. నకిలీ ఎరువులు ఇవ్వడానికి జంకుతారు.