నాగర్కర్నూల్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పాలనలో సచివాలయం ఎలాగో.. గ్రామాల్లో పరిపాలనకు గ్రామ పంచాయతీ భవనం కీలకం. అలాంటి పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో స్వపరిపాలన జరుగుతున్నది. గిరిజనులే పాలకులుగా మారారు. అయితే పంచాయతీలకు పక్కా భవనాలు లేక చాలా గ్రామాల్లో పరిపాలన ఇబ్బందిగా మారింది. గ్రామ పంచాయతీ సమావేశాలు సైతం సరిగ్గా నిర్వహించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. గిరిజన తండాలు కావడంతో పక్కా భవనాలు లేకపోవడంతో కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ వంటి ప్రభుత్వ కార్యాలయాలను పంచాయతీ భవనాలుగా మార్చారు. దీంతో పూర్తిస్థాయిలో పరిపాలన జరగడం లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది. నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తూ పల్లె ప్రగతి ద్వారా పారిశుధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రతి పంచాయతీకి కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు.
ఆస్తి పన్ను వసూలు, పంచాయతీ ట్రాక్టర్, రికార్డులు, ఇతర ఆస్తుల రక్షణకు పక్కా భవనాలు తప్పనిసరిగా అయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో సరైన రక్షణ, సదుపాయాలు కరువయ్యాయి. అలాగే వననర్సరీలు, తాగునీటి నిర్వహణ, పలు పథకాల అమల్లో గ్రామ సభకు ప్రాధాన్యత ఇస్తున్నది. ముఖ్యంగా పంచాయతీల నుంచి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు, పారిశుధ్యం, క్లోరినేషన్, వీధి దీపాల నిర్వహణ వంటి 55 రకాల రిజిష్టర్లు పంచాయతీలు నిర్వహిస్తున్నాయి. దీంతో పనులు పెరిగి ప్రజల రాకపోకలూ పంచాయతీలకు అధికమయ్యాయి. ప్రతి పంచాయతీలో కనీసంగా పది మంది వార్డు సభ్యులు ఉంటారు. వర్షాకాలంలో రికార్డులను భద్రపర్చడంతోపాటు ఇలా వచ్చిపోయే ప్రజలు, అధికారులు, వార్డు సభ్యులకు తాత్కాలిక గదుల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు అనుకూలంగా ఉండడం లేదు. దీంతో చాలా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పక్కా భవనాలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో గిరిజన పంచాయతీలకూ పక్కా భవనాలను నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కో భవనాన్ని రూ.25 లక్షలతో నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇప్పటికే పంచాయతీల్లో స్థలాల గుర్తించి ఉంటే అనుమతులు మంజూరు చేయడంతోపాటు స్థలాలు లేని చోట్ల స్థల సేకరణలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి పంచాయతీ భవనం కోసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. ఇలా ఆధునిక హంగులతో గిరిజన పంచాయతీల్లో నూతన పరిపాలన భవనాలు నిర్మించనుండడం విశేషం. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 80 గిరిజన పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున రూ.20 కోట్లు మంజూరయ్యాయి. నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంపై గిరిజన పంచాయతీల సర్పంచ్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
80 భవనాలకు నిధులు మంజూరు..
నాగర్కర్నూల్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 80 గిరిజన పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కొత్త కార్యాలయాల నిర్వహణకు స్థల సేకరణ చేపడుతున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా శంకుస్థాపనలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త భవనాల వల్ల పంచాయతీ రికార్డులకు రక్షణ, పరిపాలన, నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్