ఉమ్మడి జిల్లా సప్తవర్ణాలతో పులకించిపోయింది. పుడమి రంగుల సింగిడి పర్చుకున్నది. ప్రేమ, అప్యాయత, సౌభ్రాతృత్వానికి రంగుల పండుగ ప్రతీకగా నిలిచింది. అంతటి కలర్ఫుల్ రంగులకేళీ హోలీని సోమవారం ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పల్లెలు, పట్నాల్లోని వీధులన్నీ రంగులమయమయ్యాయి. ఉదయం నుంచే చిన్నారులు రంగుల డబ్బాలతో దర్శనమిచ్చారు. యువత కేరిం తలు కొడుతూ సందడి చేయగా.. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డీజే పాటలు, బ్యాండ్మేళాల మోతలు హోరెత్తగా.. డ్యాన్స్ల జోరు కొనసాగింది. పలు చోట్ల యువకులు ఉట్లు కొట్టగా.. కొన్ని ప్రాంతాల్లో బైక్ ర్యాలీ జోరుగా కొనసాగింది. కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలు చోట్ల ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.