సిటీ బ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినా డిజిటలైజేషన్ మాత్రం మందకొడిగా సాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి డిజిటలీకరణ 43 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42 శాతం, రంగారెడ్డి జిల్లాలో 52శాతం పూర్తయ్యింది.
గ్రామీణ జిల్లాల్లో ఇది ఇప్పటికే 70 నుంచి 80 శాతానికి చేరింది. విద్యావంతులు ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలో డిజిటలైజేషన్ ఇంకా 50 శాతం దగ్గరే ఉండటానికి ప్రధాన కారణం బీఎల్వోల నిర్లక్ష్యమేనని తెలుస్తున్నది. ఫారాల పంపిణీ క్షేత్రస్థాయిలో చేయకపోయినా కనీసం ఓటర్లు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని ఆన్లైన్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది బీఎల్వోలకు యాప్ నిర్వహణ ఇప్పటిదాకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బీఎల్వోల తీరును పర్యవేక్షించాలని.. వివరాలు పకడ్బందీగా నమోదు చేస్తూ అసలైన ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.