హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఎల్నినో కారణంగా తెలంగాణలో ఇప్పటికే వర్షాలు సరిగా పడటం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం రవీంద్రభారతిలో ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వర్షాభావంతో ప్రాజెక్టులకు జలకళ లేదు. రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీరే కాకుండా కరెంటు సరఫరా కూడా కష్టమవుతుంది.
మొత్తం థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడితే బొగ్గును సమకూర్చుకోవడం కూడా కష్టమే. కాబట్టి నీళ్లతోపాటు కరెంటును కూడా పొదుపుగా వాడుకోవాలి’ అని సూచించారు. ఎల్నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉంటుందని, కానీ ఎల్ నినో ప్రభావంతో వేసవి నాటి డిమాండ్ను తలపిస్తున్నదని చెప్పారు. మరోవైపు భట్టి వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లను వదిలేస్తూ ఇప్పుడు నీతి మాటలు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ , ఐఏఎస్ అధికారులు దివ్యదేవరాజన్, గోపి, జితేశ్ , ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.