పెంట్లవెల్లి, మే 14 : అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పెంట్లవెల్లి స్వరాష్ట్రంలో మండలంగా ఏర్పాటైన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి నూతన మండలానికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు. మండల కేంద్రం సమీపంలో కేజీబీవీ పాఠశాలను రూ.4కోట్లతో నిర్మించి కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యను అందిస్తున్నారు. మండలకేంద్రం సమీపంలో ప్రవహిస్తున్న ఎంగంపల్లితండా వాగు 70 ఏండ్లుగా వానకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా పారి ఏటిగడ్డ ప్రజల అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎమ్మెల్యే బీరం ప్రత్యేక చొరవ తీసుకొని ఎంగంపల్లితండా వాగుపై రూ.9.60కోట్లతో చెక్డ్యాంతో పాటు హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టారు.
తక్కువ సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. మండల కేంద్రం సమీపంలోని చౌడేశ్వరిదేవి ఆలయ సమీపంలో రూ.60లక్షలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు కొన్నసాగుతున్నాయి. మండలంలో వివిధ కులసంఘాలకు రూ.50లక్షలతో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు, రూ.9కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు రూ.8కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, రూ.1.50కోట్లతో మండలంలోని వివిధ గ్రామాలకు పంచాయతీ భవనాల నిర్మాణాలు, రూ.3.50కోట్లతో మూడు జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు, ఐదు ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి రూ.28లక్షలతో మల్లేశ్వరం, మంచాలకట్ట, జటప్రోల్, గోప్లాపురం, కొండూరు గ్రామాలతోపాటు మండల కేంద్రంలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. అలాగే వివిధ గ్రామాల్లో చెక్డ్యాంల నిర్మాణం, రైతులకు సాగునీటిని అందించేందుకు మరమ్మతు పనులు చేపట్టారు.
మండల కేంద్రం సమీపంలోని చౌటచెరువు ఎన్నో ఏండ్లుగా మరమ్మతుకు నోచుకోక కోతకు గురైంది. గత పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారింది. అంతేకాక ఈ చెరువు కట్టపై పెబ్బేరు-కొల్లాపూర్ ప్రధాన రహదారి ఉంది. వాహనదారులు రాత్రింబవళ్లు రాకపోకలు సాగించేవారు. ఇరుకు రహదారిపై ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ఎమ్మెల్యే బీరం రూ.10కోట్ల నిధులు మంజూరు చేయించి చౌటచెరువు కట్ట విస్తరణతో పాటు మినీట్యాంక్ బండ్ నిర్మాణానికి మంత్రి నిరంజన్రెడ్డితో శంకుస్థాపన చేయించారు. నిర్మాణ పనులు 60శాతం పూర్తయ్యాయి.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చేతల మనిషి. గత పాలకులు 20 ఏండ్లుగా అభివృద్ధ్దిని మరిచారు. గెలిచిన అతి తక్కువ కాలంలో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా బీరం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనులతో మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి పథకంలో ముందుకు సాగుతున్నాయి. ఎమ్మెల్యే సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– చిట్టెమ్మ, జెడ్పీటీసీ, పెంట్లవెల్లి
మండల అభివృద్ధి కోసం అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఊహించని విధంగా ఎంతో కృషి చేశారు. కస్తూర్బా పాఠశాల, మినీట్యాంక్ బండ్, ఎంగంపల్లి బ్రిడ్జి నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ప్రజలంతా రుణపడి ఉంటారు.
– ఉమామహేశ్వరి, ఎంపీపీ, పెంట్లవెల్లి