మహబూబ్నగర్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. వచ్చేనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, మే 13న పోలింగ్ నిర్వహించి, జూన్ 4న ఫలితాలను ప్రకటిస్తారన్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఖరారు చేశారు.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సిట్టింగ్ స్థానాల్లో గెలుపొందేందుకు గులాబీ పార్టీ పావులు కదుపుతున్నది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,35,814 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 16,81,643 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించగా, నాగర్కర్నూల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ ఇంకా స్పష్టతనివ్వలేదు. అన్ని పార్టీలకు ముందుగానే భారత రాష్ట్ర సమితి మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి కేటాయించింది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు స్థానం కల్పించింది. ఈ మేరకు అన్ని సెగ్మెంట్లలో మాజీ ఎమ్మెల్యేలు మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 16, 81,643 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 8,32,080 మంది పురుషులు, 8,48,293 మంది మహిళలు, 44మంది ట్రాన్స్జెండర్లు, 1,226 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. నాగర్కర్నూల్ పార్లమెం ట్ పరిధిలో మొత్తం 17,35,814 మంది ఓటర్లు కాగా, 8,64, 034 మంది పురుషులు, 8,70,694 మంది మహిళలు, 45 ట్రా న్స్జెండర్లు, 1,041 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. షె డ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించకుండా చర్యలు చేపట్టాలని, వచ్చే 72గంటల్లోపు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఆయుధాల లైసెన్సు లు కలిగిన వారందరితో మాట్లాడి పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చే సేలా సిబ్బందిని ఆదేశించినట్లు ఎస్పీలు ప్రకటించారు. పార్లమెం ట్ ఎన్నికల వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా బందోబస్తు చేపట్టాలని, చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాలని ఆయా జిల్లా ఎస్పీలు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.