నాగర్ కర్నూల్ : పంచాయతీ కార్మికుల( Panchayat Workers) పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని డీపీవో శ్రీరామ్కు అందజేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణలో 12,790 గ్రామ పంచాయతీల లో 60 వేల మంది గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులు ఏళ్ల తరబడి పని చేసినా గాని పనికి భద్రత లేదని, కనీస వేతనాలు,ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమాలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
పంచాయతీ కార్మికులకు ప్రతినెల 50 కోట్ల రూపాయల వేతనాలు బడ్జెట్ కేటాయిస్తు న్నామని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పి ఖాతాల్లో జమ కాలేదని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, కెవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరాజు , గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లింగస్వామి, సహాయ కార్యదర్శి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.