పాలమూరు, డిసెంబర్ 31 : పాలమూరు పట్టణం శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో జనవరి 22న బలరాములు కొలువుదీరనున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అక్షింతలు, కలశాలతో ఆదివారం జిల్లా కేంద్రంలోని తూర్పుకమాన్ నుంచి శోభాయాత్ర వైభవంగా సాగింది. శ్రీరామ నామంతో వీధులన్నీ మార్మోగాయి. భక్తిభజన బృందాలతో శ్రీరామ జెండాలు రెపరెపలాడాయి. అదేవిధంగా సీతారామ కల్యాణమండపాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండుతులతో 108 సార్లు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించి ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం కళాశాల ఊరేగింపు ప్రారంభించారు.
కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, డీకే అరుణ, బీజేపీ నాయకుడు మిథున్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 15వరకు ప్రతి కార్యకర్త గడపగడపకూ తిరిగి రామ పూజిత శ్రీరామ జయరామ మహా మంత్రాన్ని జపించాలన్నారు. అయోధ్యలో 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అక్షింతలను తలపై చల్లుకొని పెద్దల ఆశీర్వదాన్ని తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నగర సంయోజకులు మద్ది యాదిరెడ్డి, సంఘ పెద్దలు దేవేందర్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేశ్, జిల్లా కార్యదర్శి హన్మంతు, మల్లేశ్, రామరాజ్, పట్టణ క్షేత్రాల ధార్మిక సంస్థల భక్త భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.