మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 17 : మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ (టీ హబ్)కు రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సుమారు 50కిపైగా అన్ని రకాల అధునాతన వైద్య పరీక్షలను ఉచితంగా ఇక్కడ చేస్తున్నామని తెలిపారు. అందుకే రాష్ట్రంలోనే మొదటిసారిగా అక్రిడిటేషన్ రావడం గర్వించదగ్గ విషయమన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన సకల వైద్య పరీక్షల కేంద్రం టీ హబ్కు జాతీయ అక్రిడిటేషన్ లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. వైద్యులు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ టీహబ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గతంలో క్యాన్సర్ పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్థానికంగానే ఆ పరీక్షలు చేసేందుకు అవకాశం లభించబోతుందని చెప్పారు. గతంలో మెడికల్ కళాశాలలు లేక వైద్య విద్య అందకపోవడంతోపాటు చాలినంత మంది వైద్యులు లేక వైద్యం అందే పరిస్థితి ఉండేది కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మూడు మెడికల్ కళాశాలలు ప్రారంభం కాగా త్వరలో మిగతా రెండు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్లో వెయ్యి పడకల అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే అన్ని రకాల వైద్య సదుపాయాలు స్థానికంగానే లభించనున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 3,21,777 వైద్య పరీక్షలు
గతంలో ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే అనేక ఖరీదైన వైద్య పరీక్షలు ఇప్పుడు టీహబ్లో ఫుల్లీ ఆటోమెటిక్ ఎక్విప్మెంట్తో సుమారు 50కిపైగా వైద్య పరీక్షలు ఉచితంగా లభిస్తున్నాయన్నారు. స్థానిక టీ హబ్ లో ఇప్పటివరకు 1,03,730 మంది రోగుల నుంచి 1,72, 413 శాంపిల్స్ సేకరించి 3,21,777 వైద్య పరీక్షలు నిర్వహించి 19,15,283 రకాల నివేదికలు అందచేసినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ భాస్కర్, ఆర్ఎంవోలు లక్ష్మణ్, ప్రసన్న, టీహబ్ మోడల్ ఆఫీసర్ సృజన, పెథాలజిస్ట్ అరుణ, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.