మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 1: జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటుచేసిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించి మాట్లాడారు. గతంలో ప్రభుత్వ దవాఖానలో సదుపాయాలు ఉండేవి కాదని, 20మంది వైద్యులు, న ర్సులే ఉండేవారన్నారు. ప్రస్తుతం 100మందికిపైగా వై ద్యులు, 400మందికిపైగా నర్సులు సేవలందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే మొదటి మెడికల్ కళాశాల మంజూరు చేశారని, నర్సింగ్ కళాశాలను కూడా మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. త్వరలో ఫిజియోథెరపీ కళాశాల రాబోతున్నదన్నారు. వైద్యవృత్తిలో డాక్టర్ తర్వాత ఆత్యున్నత సేవలందించేది నర్సులు మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడడంలో నర్సుల పాత్ర ఎనలేనిదన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.500కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభిస్తామన్నారు. నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని, వచ్చే ఏడాదికి కళాశాల భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలో వైద్యరంగంలో పెనుమార్పులు వచ్చాయని, 2014కు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది సమయపాలన పాటించి పేదప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, అదనపు వైద్యాధికారి డాక్టర్ భాస్కర్నాయక్, డిప్యూటీ సూపరిటెండెంట్ డాక్టర్ జీవన్, డాక్టర్ రాధ, డాక్టర్ రఫీక్, కౌన్సిలర్ నీరజావిఠల్రెడ్డి, షబ్బీర్, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మి, మల్లేశ్, సత్యనారాయణ, నర్సిం గ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 1: తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, దీంతో ఇతర పట్టణాలకు వలసలు వెళ్లిన ప్రజలు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మోటార్లైన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి సమక్షంలో ట్రాక్టర్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు రమేశ్రెడ్డి, ప్రధానకార్యదర్శి హిజీబాబా, కోశాధికారి నర్సింహులు, కార్యనిర్వాహక ప్రధానకార్యదర్శి శేఖర్తో సహా సుమారు 200 మంది వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, ప్రధానకార్యదర్శి వినోద్, కౌన్సిలర్ రామ్లక్ష్మణ్, నాయకులు సత్యం, సుధాకర్, శ్రీనివాసులు, రమేశ్, నర్సింహులు రాములు, నూరుబాయి, బాలుముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.