జహీరాబాద్, జూలై 17: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో మహిళా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరాతీశారు. ఈనెల 16న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ప్రచురితమైన ‘ప్రాణాల మీదికి తెచ్చిన నిర్లక్ష్యం’ వార్త కథనంపై ఆయన స్పందించారు.
మిర్జాపూర్(బీ) సీహెచ్సీలో న్యాల్కల్ మండలం గంగ్వార్కు చెందిన ముత్తమ్మ రక్త పరీక్ష రిపోర్టుకు బదులు మరో రోగి రిపోర్టును వైద్యాధికారి ఆదరాబాదరాగా చూసి పలు వ్యాధులు సోకాయని మందులు రాసి ఇవ్వడం ఏమిటని మంత్రి ఆరాతీశారు. రక్త పరీక్ష రిపోర్టు సంగారెడ్డి ల్యాబ్ నుంచి వచ్చినట్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి మంత్రికి వివరించినట్లు సమాచారం. రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించకుండా ఎలా వైద్యం చేస్తారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించమని మంత్రి హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎంవో కార్యాలయం నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులు సీహెచ్సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది. ఆయ న శుక్రవారం మిర్జాపూర్(బీ) సీహెచ్సీలో వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముత్తమ్మకు అందించిన వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారులు, సిబ్బందిని సూపరింటెండెంట్ ఆదేశించారు.