కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం హోరెత్తుతున్నది. యాసంగి వరి కొనుగోలులో మోదీ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ వ్యాఖ్యలను నిరసిస్తూ వడ్లు కొనకుంటే నూకలు చెల్లినట్లే అని ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తుండగా.. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలతో యుద్ధం ప్రకటిస్తున్నాయి. తీర్మాన ప్రతులను ప్రధాని మోదీకి పంపిస్తున్నాయి. వీరికి రైతులు, వివిధ వర్గాలు అండగా నిలుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటాలు ఆగవని నిర్ణయించాయి. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరులో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గ్రామసభ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీర్మానం చేయగా.. పలువురు మద్దతు ప్రకటించి ఆమోదించారు. రాష్ట్రంలోని కర్షకులు పండించిన వడ్లను పంజాబ్ మాదిరిగానే కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ మార్చి 27 : వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయాలన్న బాధ్యాతయుతమైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపైనా మండిపడుతున్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఊరూరా నిరసనలు వెల్లువెత్తాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గాలన్నీ ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. ఆమోదించిన తీర్మానాల ప్రతులను ప్రధాని కార్యాలయానికి పోస్ట్ చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రైతుల కష్టానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామ పంచాయతీ, పీఏసీసీఎస్ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రి సమక్షంలోనే కేంద్రం ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రధాని మోదీకి లేఖను పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానూ తీర్మానాలు కొనసాగుతున్నాయి.
స్థానిక సంస్థల నిరసన జోరు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహా ఉద్యమం కొనసాగుతున్నది. స్థానిక సంస్థలు తీర్మానాల పేరిట కేంద్రం, ప్రధానికి తమ నిరసనను తెలియచేస్తున్నాయి. రైతు చట్టాలను నిరసిస్తూ కేంద్రం దిగివచ్చే వరకు ఉత్తరాది రైతులు నిరసన చేపట్టి అనేక మంది రైతులు అమరులైనా చివరకు విజయం సాధించారు. కేంద్రం దిగివచ్చింది. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి మరీ చట్టాలను ఉపసంహరించుకున్నారు. అదే తరహాలో తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంపై పోరుకు సర్వత్రా ముందుకు వచ్చారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ తీర్మానాలు చేస్తున్నాయి. కోడూరు తరహాలోనే ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి ప్రధానికి లేఖలు పంపిస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రైతులు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని చేసిన వ్యాఖ్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సభ్యుల ఆధ్వర్యంలో సర్పంచులు.. ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఎంపీపీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. రైతులను ఏడిపించిన రాజ్యం విలసిల్లలేదని.. రైతుతో పెట్టుకున్నోళ్లు చరిత్రలో నిలవలేదని.. రైతు కన్నెర్రజేస్తే మాడిమసైపోతారని సభ్యులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం కేంద్రం ధాన్యం సేకరించాలంటూ ఈ నెల 31 వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలు, రైతుబంధు కమిటీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో తీర్మానాలు చేసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పంపనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు, మండల పరిషత్లల్లో తీర్మానాలు చేసి ప్రధానికి పంపారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సమావేశాలు నిర్వహించి బీజేపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాల్సిన బీజేపీ సర్కారు తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తున్నదని సర్పంచులు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వడ్లను కొనుగోలు చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని సర్పంచులు చెబుతున్నారు.
ప్రధానికి అర్థమయ్యేలా తీర్మానం
వడ్ల కొనుగోలు విషయంలో ప్రధానికి అర్థమయ్యేలా గుజరాతీ భాషలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి పంపినం. నిబంధనల ప్రకారం వడ్లు, కొనుగోలు చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. వడ్లను కొనుగోలు చేసేదీ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం వారి అహంకార ధోరణికి నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకూ నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
– రమేశ్నాయక్, సర్పంచ్, బోడగుట్టతండా
రైతులపై కేంద్రం కక్ష సాధింపు
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులను అవమానించేలా ఆరోపణలు చేయడం సరికాదు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని మండలంలోని 44 గ్రామ పంచాయతీల తీర్మానాలను కేంద్ర మంత్రికి పంపించాం.
– బీ.కృష్ణయ్య, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు కోయిలకొండ
కొనేవరకు ఉద్యమిస్తాం
తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అవహేళనగా అన్న మాటలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెనక్కి తీసుకోవాలి. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీలో పాలకవర్గం సభ్యులతో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ఎడలా రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. కేంద్రం స్పందించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.
– బండి పావని, సర్పంచ్ ,పామిరెడ్డిపల్లి