ఊర్కొండ, ఫిబ్రవరి 2 : ఆపదలో ఉన్న వారికి అభయమిచ్చే ప్రదాత.. భక్తుల కోర్కెలు తీర్చే అభయాంజనేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఊర్కొంటపేట పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 10వ తేదీ మాఘశుద్ధ పాఢ్య మి వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి మంగళ, శనివారాల్లో ఆలయంలో అర్చనలు, అభిషేకాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన వాస్తు, శిల్ప కళాకారులైన బ్రహ్మరాయులు, భోజరాయులు, సింగరాయులు అనే ముగ్గురు అన్నదమ్ములు పనిలో ఎంతో ప్రాముఖ్యతను సాధించడంతో నిజాం నవాబు వారి ప్రతిభను మెచ్చి ఊర్కొండ పేటకు ఉత్తరాన ముగ్గురు అన్నదమ్ములకు 1500 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. వారు ఒక్కొక్కరు 500ఎకరాలు చొప్పున పంచుకొని తమ పేర్ల మీద గ్రామాలను ఏర్పాటు చేసుకున్నట్లు స్థల పురాణం చెబుతున్నది. వాస్తు శాస్త్ర నిపుణుడు అయిన పెద్దవాడు పశ్చిమాన బ్రహ్మరాయపల్లి, మధ్యవాడు భోజరాయపల్లి, చిన్నవాడు తూర్పున సింగరాయపల్లి గ్రామాలను నిర్మించుకొని నివా సం ఉంటున్నారు. కాలక్రమేణా భోజరాయపల్లి తగులబడిపోగా ఆ ఊరికి ఉత్తరాన గట్టు పక్కన ఇప్పచెట్ల మధ్య భోజరాయులు గట్టుఇప్పలపల్లిని నిర్మించుకోగా పాత ఉరు ప్రాంతం అమ్మపల్లిగా వెలిసింది. నేడు అదికూడా కనుమరుగైపోగా అక్క డ ఇప్పుడు ఒక్క ఆంజనేయస్వామి విగ్రహం మాత్రమే మిగిలి ఉంది. బ్రహ్మరాయపల్లిని నేడు బొమ్మరాజుపల్లిగా పిలుస్తున్నారు. నాటి సింగరాయపల్లిని నేడు వీరన్నపల్లిగా పిలుస్తున్నారు. అయి తే గట్టుఇప్పలపల్లి వారు గ్రామంలో పంచలింగాలను ఏర్పాటు చేశారు. భోజరాయులు ఆంజనేయస్వా మి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్న ఊర్కొండపేట గుట్టపై ప శ్చిమాన పిల్లిగుండ్ల వద్ద ఒక పెద్ద విగ్రహాన్ని మలిచి ఆ విగ్రహాన్ని ఎడ్లబండిపైన పెట్టుకొని వెళ్తుండగా మార్గమధ్యలో ఆ ఎడ్లబండి ఇరుసు విరిగి పోవడంతో వేరే బండిని తెచ్చి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా ఆ బండి కదలలేదు. దీం తో ఆయన ఆ రాత్రి అక్కడే నిద్రించాడు. ఆ రాత్రి భోజరాయుల వారి కలలోకి ఆంజనేయస్వా మి వచ్చి నన్ను ఇక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి ఆ ఆంజనేయస్వామి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. ఇక అప్పటి నుంచి ప్రతి యేటా పుష్యమాసం మొదలుకొని ఆంజనేయస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శనివారం ఉదయం 9గంటలకు ఊర్కొండపేటకు చెందిన కీర్తి శేషులు చిరివెల్లి కృష్టముర్తిశర్మ గృహం నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగించి ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం 10 గంటలకు ధ్వజారోహణం నిర్వహించి స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి వెండి ఆభరణాలతో సహస్ర నామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం(4న) ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు సహస్ర నామార్చన, గజవాహన సేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం (5న)రాత్రి (తెల్లావారితే మంగళవారం) స్వామివారి పూజలు రథోత్సవం నిర్వహించడంతోపాటు స్వామివారి పంచసూక్తులతో పూజలు నిర్వహిస్తారు. మంగళవారం నుంచి(6నుంచి 10వ తేదీ) స్వామివారి ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.