నాగర్కర్నూల్, మే 26 (నమస్తే తెలంగాణ) : కందనూలులో గాలివాన ఎనిమిది మందిని బలితీసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి భారీగా ఆస్తినష్టం సంభవించగా, నేలకొరిగిన వృక్షాలతో రాకపోకలకు అంతరాయం కలుగగా.. తెగిపడిన విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
నాగర్కర్నూల్ జిల్లాలో అకాల వర్షం తీవ్ర న ష్టాన్ని మిగిల్చింది. రోహిణి కార్తె ప్రారంభంలోనే అకాల వర్షానికి జిల్లా అతలాకుతలమైంది. ఆదివారం ఉదయం నుంచి ఎండతోపాటు ఆకాశం మేఘావృతమై తీవ్ర ఉక్కపోతగా ఉన్నది. మధ్యా హ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగా ఈదురు గాలులు వీచగా.. వరుణుడు కూడా తోడయ్యాడు. దీంతో కల్వకుర్తి, నాగర్కర్నూల్, బిజినేపల్లి, పాలెం, తిమ్మాజిపేట, పెద్దూరు, చెన్నపురావుపల్లి, అచ్చంపేట ప్రాంతా ల్లో భారీ వర్షాలు కురిశాయి. తిమ్మాజిపేట, అచ్చంపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మట్టి ఇండ్లు కూలిపోగా షెడ్లు, ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని తాడూర్ మండలం ఇంద్రకల్ శివారులో నిర్మాణంలో ఉన్న రేకుల షె డ్డు కూలి యజమాని మల్లేశ్(40 ), కూతురు అ నూష(13)తో పాటు మరో ఇద్దరు అడ్డా కూలీలైన రాములు(45), చెన్నమ్మ(43) అక్కడికక్కడే మృ తిచెందారు. పార్వతమ్మ, చిన్ననాగులు, నాగరాజు తీవ్రంగా గాయపడగా జిల్లా దవాఖానకు తరలించారు. తెలకపల్లిలో పిడుగుపాటుకు గురై లక్ష్మణ్ (13), నందివడ్డెమాన్లో రైతు గోపాల్రెడ్డి (45) మృతిచెందారు. నాగర్కర్నూల్ మండలం మంతటిశివారులో రేకులషెడ్డు ఎగిరిపోయి పక్కనే ఉన్న కారుపై పడడంతో వేణుగోపాల్(40) స్పాట్లోనే చనిపోయాడు. అలాగే తిమ్మాజిపేట మండలం మారేపల్లి గ్రామంలో పిడుగుపాటు తీవ్రతకు వెంకటయ్య (52) మృతి చెందాడు. జిల్లా కేంద్రంలో గాలివాన ప్రభావంతో రోడ్లన్నీ జలమయమవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.