విదేశాల్లోనే పండే ఆయిల్పాం నేడు ఉమ్మడి జిల్లా ముంగిట వాలింది. గత కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందించడం.. అధికారుల సలహాలు, సూచనలతో రైతులు మొగ్గు చూపారు. దీంతో రోజురోజుకూ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వనపర్తి జిల్లాలో ఇప్పటికే 6 టన్నుల దిగుబడి వచ్చింది. శ్రీరంగాపురం మండలం కంబాళాపురంలో రైతు ఆనంద్రెడ్డి నాలుగున్నర ఎకరాల్లో తోట సాగు చేయగా.. ఇటీవలే 6 టన్నుల గెలలు వచ్చాయి. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన కంపెనీ యజమానులు ముందుకొచ్చి రైతులకు ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలుకుతున్నది. మూడు, నాలుగో ఏటనే పంట చేతికొస్తున్నది. కొన్ని చోట్ల పూత, పిందెలు రాగా.. వచ్చే ఏడాదికి కాపునకు వచ్చే అవకాశం ఉన్నది. దీనికితోడు కొందరు రైతులు తోటలో అంతరపంటగా వేరుశనగను సాగు చేసి లాభాలు పొందుతున్నారు.
వనపర్తి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : మూస పద్ధతుల సాగుకు స్వస్థి పలికి నూతన వొరవడితో వ్యవసాయాన్ని నడిపించే దిశగా గత కేసీఆర్ సర్కారు అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా సాగు చేసిన ఆయిల్పాం సాగు కాపుకొచ్చింది. ఆయిల్పాం ఇది వరకే సాగు చేసి లాభాలు గడిస్తున్న ఖమ్మంవంటి ప్రాంతాలకు వనపర్తి జిల్లాకు చెందిన వేలాది మంది రైతులను ఉచితంగా ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకెళ్లి ఆయిల్పాం సాగుపై అధికారులు అవగాహన కల్పించారు. చివరకు రైతులు కూడా ఆసక్తి కనబరచడం, ప్రభుత్వం ప్రోత్సహించడంతో సాగు చేశారు. ఈ క్రమంలో ఇక్కడి ప్రధాన పంటలుగా ఉన్న వరి, వేరుశనగలకు ప్రత్యామ్నాయ పంటగా అయిల్పాంను రైతులు సాగు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. సాధారణ పంటలే కాకుండా వాణిజ్య పంటల వైపునకు రైతులను మళ్లించడంలో నాటి సర్కార్ సఫలీకృతమైంది. పశుపక్షాదుల నుంచి సులభంగా రక్షించుకునే వెసలుబాటు ఉన్న ఆయిల్పాం అనేక రకాలుగా రైతులకు ఊరటనిస్తున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే వనపర్తి ప్రాంతంలోనే అత్యధికంగా ఆయిల్పాంను సాగు చేశారు. గత కేసీఆర్ సర్కారు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తన పొలంలో ఆయిల్పాం సాగు చేసి భరోసాగా నిలవడంతో ఈ ప్రాంత రైతులు అదే బాట పట్టారు.
జిల్లాలో 4,500 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగయ్యాయి. గత ఏడాది 3వేల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాదిలో 1,200 ఎకరాలు, 2019-20లో పైలట్ ప్రాజెక్టు కింద మరో 250 ఎకరాలను సాగు చేశారు. జిల్లాలోని 14 మండలాల్లో 787 మంది రైతులు అయిల్పాంను సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా రైతుల నుంచి వచ్చే డిమాండ్ను బట్టి జిల్లా ఉద్యానశాఖ అధికారులు అయిల్పాం సాగుకు సహకారం అందిస్తున్నారు. మండల, గ్రామ స్థాయిలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వరి, వేరుశనగ సాగుకంటే అధిక లాభసాటిగా ఉండే ఆయిల్పాంను చేపట్టేందుకు అవసరమైన చర్యలను ఉద్యానశాఖ తీసుకున్నది. సాంప్రదాయ పంటలకు రైతులను దూరం చేస్తూ వాణిజ్య పంటల సాగు వైపునకు సమాయత్తం చేయడం ద్వారా సాగు పెరుగుతున్నది.
చూస్తుండగానే ఆయిల్పాం పంట చేతికొచ్చింది. రైతుల అనుమానాల ను పటాపంచలు చేస్తూ అ నుకున్న రీతిలో ఆయిల్పాం గె లలు రైతుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చేతికి వచ్చి న పంటను ఖమ్మం ప్రాంతానికి తరలించి విక్రయాలు చేస్తున్నారు. స్థానికంగానే ఆయిల్పాం కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశగానూ కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకున్నది. ఈ మేరకు కొత్తకోట రోడ్డులో సంకిరెడ్డిపల్లి స్టేజీ సమీపంలో ఆయిల్పాం కంపెనీ ఏర్పాటుకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. శ్రీరంగాపురం మండలం కంబాలాపురంలో రైతు అనంతరెడ్డి నాలుగున్నర ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్పాంలో పంటచేతికి రాగా, ఇటీవలే 6 టన్నుల వరకు వచ్చింది. వచ్చిన పంటను ఖమ్మం జిల్లాకు కంపెనీ యజమానులు రైతులకు ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ.12 నుంచి రూ.14వేల వరకు గెలలకు ధరలు పలుకుతున్నాయి. మూడేండ్ల కిందట సాగు చేయగా, నాలుగవ ఏటనే పంట చేతికొచ్చింది. అయితే, పంట ఇప్పుడే మొదలైనందునా ఏ మేరకు దిగుబడులు, లాభనష్టాలు తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.
ఆయిల్పాం సాగుచేస్తున్న రైతులకు కేసీఆర్ సర్కార్లో 90శాతం మేర సబ్సిడీ ఇవ్వడంతో మక్కువ చూపారు. ఎకరాకు 50మొక్కల చొప్పున నాటే మొక్కలకు రైతులు ఒక మొక్కకు కేవలం రూ.20 మాత్రమే చెల్లించాలి. అయిల్పాం సాగులో అంతర పంటలను కూడా సాగు చేసుకునే వెసలుబాటు ఉన్నది. ఇలా నాటిన తోటలకు ఏడాదికి ఎకరాకు రూ.4,200 మెయింటనెన్స్ కోసం నాలుగేండ్లపాటు సర్కార్ ఇస్తుంది. సన్న, చిన్నకారు రైతులై ఉండి ఐదెకరాల్లోపు ఉన్న వారికే మాత్రమే ఇలా మెయింటనెన్స్తోపాటు డ్రిప్లోనూ 90శాతం వరకు సబ్సిడీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు కేవలం జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే, పెద్ద రైతులకైనా మొక్కలను మాత్రం కేవలం రూ.20కే సర్కార్ అందిస్తున్నది. వీరికి డ్రిప్లో, మెయింటనెన్స్ కింద ఎలాంటి సహకారం అందదు.
నాలుగున్నర ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేశాం. ఇంతకుముందు వేరుశనగ పంట పండించేటోళ్లం. కేసీఆర్ సర్కారు రైతులను ఖమ్మం ప్రాంతానికి తీసుకెళ్లి పంట గురించి తెలుపడంతో మాకు నమ్మకం కలిగింది. మేం ఆయిల్పాం నాటి మూడేండ్లు అయ్యింది. 6టన్నుల వరకు పంట వచ్చింది. ప్రతి 15రోజులకు ఒకసారి గెలలు తెంపుతాం. మా ఊర్లో మొత్తం 14 మంది రైతులం సాగు చేశాం.
ఐదెకరాల్లో ఆయిల్పాం సాగు చేశా. 18 నెలలు కావస్తున్నది. అక్కడక్కడా పూత,పిందెలు వస్తున్నాయి. జూలై వస్తే మొత్తం కాపుకు వచ్చే అవకాశమున్నది. రెండేళ్లుగా అంతరపంటగా వేరుశనగ సాగుచేశా. అడవి పందులు, కోతుల బెడద ఆయిల్పాంకు లేదు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందునా రైతులు సాగుకు ముందుకొస్తున్నరు.
వరి, వేరుశనగ పంటలకంటే ఆయిల్పాంతో లాభాలు బాగుంటాయి. రైతులకు లాభసాటిగా ఉండటం వల్లే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎప్పుడూ ఒకే పద్ధతి పంటలు సాగుచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆయిల్పాం తోటలకు కోతులు, అడవి పందుల బెదడ కూడా ఉండదు. నీటి వసతి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకునే రైతులకు చాలా ఉపయోగకరం.