ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే ఉన్నా కనీసం పోటీ చేయడానికి నేతలు లేక బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ వైపు చూస్తున్నది. ఇదిలా ఉండగా బీజేపీలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడింది. 2018 సీన్ రిపీట్ అవుతుందేమోనని భయం పట్టుకున్నది. సొంత జిల్లాలోనే కర్రుకాల్చి వాత పెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర నేతకు ఆపారీలో విబేధాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన జిల్లాకు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను దళిత నాయకులే ఆదరించకపోతుండటంతో అంతర్మథనంలో పడ్డారు.
మహబూబ్నగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతున్న కారు రేసును తట్టుకునేందుకు విపక్షాలు తంటాలు పడుతున్నాయి. సీఎం కేసీఆర్పైనే పోటీకి సై అన్న ఓ నేత చేపట్టిన భరోసా యాత్ర తుస్సుమన్నది. ఇలా అడుగుపెట్టారో లేదో.. వరుణుడి పేరు చెప్పి వర్షాలు రాకున్నా వాయిదా వేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం నేతలు లేని బీజేపీ.. కాంగ్రెస్ వైపు చూస్తున్నది. కాం గ్రెస్ పార్టీ కూడా బీజేపీ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చే స్తున్నది. ఇదంత ఒక ఎత్తయితే బీజేపీలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండడంతో క్యాడర్ అ యోమయానికి గురవుతున్నది. సొంత జిల్లాలోనే కర్రుకాల్చి వాత పెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర నేతకు ఆ పార్టీలో విభేధాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో నేత జడ్చర్ల టి కెట్ తన అనుచరుడికే ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్లో గందరగోళం నెలకొన్నది. ఉమ్మడి జిల్లా కేంద్రానికి చెందిన మరో నేత బీజేపీలో చేరుతానని అల్టీమేటం జారీ చేస్తున్నారు. వనపర్తి జి ల్లాలో ఓ మాజీ మంత్రికి యువనేతల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్నది. రాజకీయాలు వద్దనుకుని వెళ్లిన చిన్నారెడ్డి మళ్లీ తెరమీద కు రావడంతో ఆ పార్టీ నేతలే విసుక్కుంటున్నారు. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి బీఏస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను దళిత నాయకులే ఆదరించకవడంతో అంతర్మథనంలో ఉన్నారు. క్రమం లో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
జడ్చర్ల కాంగ్రెస్లో టికెట్ల లొల్లి..
జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఈ సారి కాంగ్రెస్ టికెట్ అనిరుధ్రెడ్డికే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో టికెట్పై ఆశపెట్టుకున్న ఏఐసీసీ నేత మల్లురవి, ఇటీవలే పార్టీలో చేరిన ఎర్రశేఖర్ ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కైంప్లెంట్ చేశారు. ఈ వ్యవహారంలో తాను తలదూర్చనని చెప్పడంతో నేతలు అమోమయమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్ని పార్టీలు తిరిగి తిరిగి చివరకు కాంగ్రెస్లో చేరిపోయారు. ఇందుకుగానూ ఓ నేతకు భారీ ప్యాకేజీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో సార్లు గాంధీభవన్ గడపవద్దకు వెళ్లి వాపస్ వచ్చారు. చివరకు తన రాజకీయ భవిష్యత్పై బెంగపెట్టుకొని ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీలేవీ ఆయనను చేర్చుకోలేదని అనుచరులే వాపోతున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో బీసీ నేత ఎన్పీ వెంకటేశ్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్కు విభేధాలున్నాయి. దీంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు డీసీసీ వర్గం ప్రచారం చేస్తున్నది.
మాజీ మంత్రికి తప్పని అసంతృప్తి..
వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ మాజీ మంత్రి చిన్నారెడ్డి నాయకత్వాన్ని యువ నేతలు సవాల్ చేస్తున్నారు. 2018లో ప్రస్తుత మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యాక రాజకీయాలకు గుడ్బై చెప్పారు. రెండేండ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి.. ఈ సారి చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ ప్రదర్శించడంతో అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న నేతలు ఖంగుతిన్నారు. ఈసారి మళ్లీ చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖామయని బహిరంగ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన పరిస్థితి ఉందని పరిశీలకులు అంటున్నారు. కారు రేసుకు ఈ రెండు పార్టీలు ఉమ్మడి జిల్లాలో ఉనికి లేకుండా పోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బడా నాయకులకే ఓటమి భయం పట్టుకుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఈ రెండు పార్టీలకు కొడంగల్, మహబూబ్నగర్, గద్వాల, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లో చివరి ఎన్నికలు కానున్నాయని పరిశీలకులు జోస్యం చెబుతున్నారు.
దిక్కులేని ‘భరోసా యాత్ర’
మహబూబ్నగర్ జిల్లాలో ‘భరోసా యాత్ర’ను వారం రోజులపాటు నిర్వహించాలని బీజేపీ నేతలు అనుకున్నారు. జిల్లా యాత్ర ఇన్చార్జిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను నియమించింది. దేవరకద్ర నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర ప్రారంభమైంది. పది మందిని వెంటేసుకొని పార్టీ నేతలు అప్పంపల్లికి తరలివెళ్లారు. అందులోనూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలే ఉన్నారు. స్థానికులెవరూ యాత్రకు మద్దతు ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు ఖంగుతిన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి బలమైన క్యాడర్ ఉన్నది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరుగులు పెడుతుడడంతో ప్రజల నుంచి బీజేపీ యాత్రకు స్పందన రాలేదు. దీంతో సాయంత్రానికే ఈటల తన యాత్రను వాయిదా వేసుకోవడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. భరోసాయాత్ర దిక్కులేకుండా పోయింది. యాత్ర రద్దు కావడంతో బ్యానర్ల ఖర్చు కూడా దండగ అంటూ బీజేపీ నేతలు గుసగుసలాడుతున్నారు.
రాజుకున్న ఆధిపత్య పోరు..
ఉమ్మడి జిల్లాలో బీజేపీని నమ్ముకున్న ఇద్దరు బడా నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి బీజేపీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్ నుంచి గద్వాలలో సొంత అల్లుడి చేతిలో ఓటమి పాలైన డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకొని పోటీ చేసింది. దీంతో జితేందర్రెడ్డి రాజ్యసభ వస్తుందని ఆశించారు. ఉప ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించి నా.. తనను కాదని చివరకు డీకే అరుణకు ఏకంగా జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో ఖంగుతిన్నారు. ఈ విషయంపై పార్టీ నేతలతో వాపోవడంతో జాతీ య కార్యవర్గంలో తీసుకున్నారు. దీంతో ఈ ఇరువురి మధ్య నేనంటే నేను అనే స్థాయికి వెళ్లింది. పార్టీ చోటామోటా లీడర్లు, క్యాడర్లు పార్టీ కార్యక్రమాలకు రా వాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ పాదయాత్ర కూడా అట్టర్ప్లాఫ్ కావడంతో పార్టీ నేతలు షాక్లో ఉన్నారు. కాగా, దేవరకద్ర నియోజకవర్గంలో ఓ సామాజిక వేత్త బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటే అతన్ని బెదిరించడంతో రాత్రికిరాత్రే దవాఖానలో చేరారు. ఉమ్మడి జిల్లాల్లో ఒకటి, రెండు నియోజకవర్గాలు తప్పా మిగతా చోట్ల నేతలే లేరు. దీంతో 2018 సీన్ రిపీట్ అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.