బాలానగర్, ఏప్రిల్ 28 : పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లులను ఏ ఒక్కరూ కూడా తనిఖీ చేయకపోవడంతో యథేచ్ఛగా ‘మూడుపువ్వులు ఆరుకాయలుగా’ అన్న చందంగా దందా కొనసాగుతుంది. యాసంగిలో సేకరించిన ధాన్యం ఇప్పటి వరకు రైస్ మిల్లులలో ఉండిపోయింది.
మిల్లర్లు బియ్యాన్ని గోదాములోనే ఉంచి కాగితాలు మాత్రమే అటుఇటు తిప్పుతున్నారు. సివిల్ పోలీసులే అధికంగా పీడీఎస్ బియ్యం పట్టుకొని కేసులు చేస్తున్నారు తప్పా సివిల్ సైప్లె అధికారులు తనిఖీలు మచ్చుకైనా చేయరు. నిఘావిభాగం పట్టింపు కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో రైస్మిల్లులకు లైసెన్స్ లేకుండా దందా కొనసాగుతుంది. తప్పనిసరిగా మార్కెట్శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. అవేమీ పట్టనట్లుగా కొందరు ఇష్టానుసారంగా దందాను కొనసాగిస్తున్నా మార్కెట్శాఖ పట్టించుకోవడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ దందా నడుస్తుంటే సంబంధితశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్లు ఉండాలని మార్కెట్శాఖ నుంచి ఆదేశాలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లుగా కొందరు మిల్లుల యజమానులు వ్యవహరిస్తున్నారు. గతంలో మార్కెట్శాఖ అధికారులు రైస్మిల్లులను తనిఖీ చేసిన సందర్భంలో తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా లైసెన్స్లు లేకుండా దర్జాగానే దందాను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి బాలానగర్, రాజాపూర్ మండలంలోని మొత్తం 8 రైస్మిల్లులు ఉండగా మండలకేంద్రంలోని రాఘవేంద్ర, మండలంలోని పెద్దరేవల్లిలో బాలాజీ, మణికంఠ, ఉడిత్యాలలో శ్రీసాయిబాలాజీ, శ్రీలక్ష్మిబాలజీ, గంగాధర్పల్లిలో వెంకటేశ్వర, రాజాపూర్లో రామాంజనేయ రైస్మిల్లున్నాయి.ఇందులో ఇద్దరు మాత్రమే లైసెన్స్లు తీసుకున్నారు. మిగతావారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా మిల్లులో సరిగా రికార్డులు ఉండవు, స్టాక్ రిజిస్ట్రర్లను చూపించరు. వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు తమకు ఏమీ పట్టనట్లుగా ఉంటున్నారని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన రికార్డులు చూపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇష్టమొచ్చినట్లు రైస్మిల్లుల దందాను కొనసాగిస్తున్నా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు చేసినా అవేమీ పట్టించుకోకుండా దర్జాగా రైస్మిల్లుల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి మిల్లులను తనిఖీ చేసి రికార్డులను, లైసెన్స్లను, స్టాక్ రిజిస్ట్రర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
మండలంలోని రైస్మిల్లుల యజమానులు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలి. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నియమ నిబంధనలు పాటించాలి. రైస్మిల్లుల యజమానులు లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
– నేనావత్ రజిని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ , ఉమ్మడి బాలానగర్
మండలంలోని రైస్మిల్లుల యజమానులు లైసెన్స్ తీసుకోవాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మిల్లులో ఉన్న స్టాక్ తదితర విషయాలను సరిగా చూయించాలి. తప్పనిసరిగా ట్రెడింగ్ లైసెన్స్, ప్రాససింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
– శివరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ, బాలానగర్