Accident | మక్తల్, జూన్ 12: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం బొందల్కుంట దగ్గర మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 18 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన దుర్గమ్మ ట్రావెల్స్ వోల్వో బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి, జక్లేర్ గ్రామాల శివారులోని జాతీయ రహదారి 167 పై లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడ్డ 18 మందిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఏడు మందిని రాయచూర్, మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు.