కృష్ణ, జనవరి 24 : పంచాయతీ నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సర్పంచులకు సూచించారు. సోమవారం కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ పూర్ణిమాపాటిల్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో పంచాయతీ నిధులు గ్రామాల అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని, అదేవిధంగా గ్రామాల్లో గ్రామపంచాయితీలకు విద్యు త్ మీటర్లు తప్పనిసరిగా బిగించుకోవాలని, అనవసర బోరు బావి విద్య్దుత్ కనెక్షన్లు తొలగించాలని, లేకుంటే సర్వీసు చార్జీ లు అనవసరంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. అనంతరం వ్యవసాయశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, శిశుసంక్షేమశాఖ అధికారులు వారి ప్రగతిని వివరించారు. పెండింగ్లో ఉన్న పనులు ఫిబ్రవరి ఆఖరులోగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం 35 మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, వైస్ ఎంపీపీ ఈశ్వర్పాటిల్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.