నారాయణపేట, ఏప్రిల్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా నారాయణపేట జిల్లాలోని సర్కారు బడులు బాగుపడనున్నాయి. నారాయణపేట జిల్లాలోని 11మండలాల్లో మొదటి విడుతలో మొత్తం 174 పాఠశాలలకు ఈ పథకం ద్వారా మరమ్మతులు చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని నారాయణపేట జిల్లా పరిధిలోకి వచ్చే మద్దూరు, కోస్గిలో 51 పాఠశాలలు, మక్తల్ నియోజకవర్గంలో 64 పాఠశాలలు, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్ద మండలాలల పరిధిలో 59 పాఠశాలలకు కొత్త సొబగులు అద్దనున్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి విద్యాశాఖాధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ అధికారులు ఎంపిక చేసిన పాఠశాలలను సందర్శించి ఎస్ఎంసీ చైర్మన్, హెడ్మాస్టర్, సర్పంచ్, గ్రామ పెద్దల సమక్షంలో ఆయా పాఠశాలలకు అవసరమైన వసతులపై ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు.
అన్ని పాఠశాలలు
పూర్తిస్థాయి అనుమతులు వచ్చిన తర్వాత ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ల పర్యవేక్షణలో పనులను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్నీ పాఠశాలలు ఒకే నమునాలో ఉండాలనే ఉద్దేశ్యంతో పాఠశాలలకు అవసరమైన పెయింటింగ్, బోర్డుల ఏర్పాటు, ఫర్నీచర్ వంటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆయా పాఠశాలలకు పంపించనున్నది. పనుల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సోషల్ ఆడిట్ కూడా చేపట్టనున్నారు.
పకడ్బందీగా చేపడుతాం
మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తాం. మొదటి విడుతలో నారాయణపేట జిల్లాలో 174 పాఠశాలలను ఎంపిక చేశాం. పాఠశాలలలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ఐదుగురితో కూడిన ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేశాం. వీరు ఆయా పాఠశాలలను సందర్శించి అవసరమైన పనులతో కూడిన ఎస్టిమేట్ను రూపొందిస్తారు. గుర్తించిన సమస్యలను హెచ్ఎంలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన పనులను మరో బృందం పరిశీలించిన తర్వాత ఆమోదించనున్నారు.
– లియాఖత్ అలీ, జిల్లా విద్యాధికారి, నారాయణపేట జిల్లా