ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీ
పాలమూరులో తెలంగాణ వాదమే లేదన్న సమైక్యవాదులు
2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రస్థానం
ఎంపీగా ఉంటూనే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్
పునర్నిర్మాణంలోనూ ఉమ్మడి జిల్లా దూకుడు
మహబూబ్నగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వాదాన్ని విస్తరించే క్రమంలో ఉద్యమనేత కేసీఆర్ రాజకీయమార్గంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయనతో కలిసి నడిచింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ సమీపంలోని జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణవాదుల సమక్షంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుత మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించారు. 2001 జూన్ 1న మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణను ఉద్యమనేత కేసీఆర్ వినిపించారు. చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా.. సాగు, తాగునీరు లేని దుస్థితిని ప్రజలకు గుర్తుచేశారు. 2003 జూలైలో ఆర్డీఎస్ రైతుల ఆవేదనను ప్రపంచానికి తెలిపేందుకు అలంపూర్ నుంచి గద్వాలకు ఎనిమిది రోజులు పాదయాత్ర చేశారు. 2008లో పాలమూరు ప్రజాగర్జనలో స్వరాష్ట్రం సాధించడమే ఏకైక ఎజెండా అని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. 2009లో కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. దీక్షా దివస్ రోజున వేలాదిమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు.
కేసీఆర్ ఆరోగ్యం విషమించిందని తెలిసి అనేకమంది ఆవేదన చెందారు. 2010లో పాలమూరుకు చెందిన విద్యార్థులు కావలి సువర్ణ, దాసరి నరేశ్ ఆత్మార్పణం చేసుకోవడం ఉమ్మడి పాలమూరు జిల్లాను కదిలించింది. టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని జనం పెద్ద ఎత్తున స్వాగతించారు. 2011లో నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నుంచి కొల్లాపూర్ వరకు 200 కిలోమీటర్లు తెలంగాణ సాధనకు పాదయాత్ర చేశారు. 2012లో సడక్ బంద్ చేపట్టిన టీఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్టు చేసి మహబూబ్నగర్ జైలుకు తరలించినప్పుడు.. ఉద్యమనేత కేసీఆర్ సంఘీభావం తెలిపారు. ఎట్టకేలకు 2013లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2014మేలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించింది. 2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది.
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పరిపాలన సాగించింది. 2019లోనూ టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన చాలా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. కానీ, టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రకెక్కడమే కాకుండా రెండో విడుత భారీ మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకున్నది. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పాలమూరులో తెలంగాణవాదం లేదని పేర్కొంటూ వచ్చిన వారందరికీ చెంపపెట్టు సమాధానం చెబుతూ.. 2009లో జరిగిన మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి ఉద్యమనేత కేసీఆర్ ఘన విజయం సాధించేందుకు పాలమూరు ప్రజలంతా కారణమయ్యారు. అలా కేసీఆర్ మన మహబూబ్నగర్ ఎంపీగా తెలంగాణ సాధించినందుకు.. ఈ ప్రాంతం ఎప్పటికీ గర్వంతో ఉప్పొంగిపోతుంది.
ఇవి కూడా చదవండి
ఘనంగా అంతర్జాల కవితా మహోత్సవం’
లాక్డౌన్ ఉల్లంఘనులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు : హైకోర్టు