నారాయణపేట రూరల్, జూన్ 23 : మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పలు శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. పిల్లిగుండ్లతండా, లింగంపల్లి గ్రామాల ప్రజలు కరోనా పరీక్షలు, అనారోగ్యంతో దగ్గరలో ఉన్న ధన్వాడ పీహెచ్సీకి వెళ్తే వైద్యులు పట్టించుకోవడం లేదని సర్పంచులు సిద్ధు చౌహాన్, రాములు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కోటకొండ వైద్యులు తెలిపారు. గ్రామాల్లో కల్లాల నిర్మాణం మందకొడిగా సాగుతున్నాయని, ఉపాధి హామీ కూలీ డబ్బులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పెమెంట్ కోసం అకౌంట్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించారు. నీటి సమస్యలపై మిషన్ భగీరథ ఏఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందిచడం లేదని తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ ఏఈకి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి పేదలందరికీ ఉచిత బియ్యం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ అంజలి, వైస్ ఎంపీపీ సుగుణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, ఎంపీడీవో సందీప్కుమార్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గ్గొన్నారు.