నారాయణపేట టౌన్, జూన్ 22 : మిషన్ కాకతీయ పథకంలో పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన 1వ(ప్రణాళిక, ఆర్థిక), 7వ(నిర్మాణ పనులు) స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖల అధికారులు జిల్లాలో చేపడుతున్న ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, ప్రభుత్వం అందజేస్తున్న రాయితీని కల్పించాలన్నారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుకుంటున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్యను పెంచాలన్నారు. ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న 89 రకాల పనులను, రోడ్లు భవనాల శాఖ విభాగంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
రైతువేదికలు మొత్తం 77 పూర్తి అయ్యాయని తప్పుడు నివేదికలు ఇచ్చారని, దామరగిద్ద మండలంలో 5 రైతు వేదికల పనులు పెండింగ్లో ఉన్నాయని, కోస్గి జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి సొంత ఊరు బోగారంలోనే ఇంత వరకు ఎందుకు పనులు మొదలు పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు. మిషన్ కాకతీయ పథకంలో ఫేస్ 2లో 23 రకాల పనులు, ఫేస్ 3లో 29 రకాల పనులు, ఫేస్ 4లో 17 రకాల పనులను పెండింగ్లో పెట్టడంపై నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్లాస్పూర్, మినాస్పూర్లో పెండింగ్లో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులు, ఊట్కూర్, జాజాపూర్లో పెండింగ్లో ఉన్న చెక్ డ్యామ్ పనులు, అమ్మిరెడ్డిపల్లిలో ఫీడర్ ఛానల్ పనులు, మరికల్ మండల కేంద్రంలో ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు, విఠలాపూర్, మల్రెడ్డిపల్లి, జిలాల్పూర్, భైరంకొండలో మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పేరపళ్ల, కొండారెడ్డిపల్లి చెరువులకు నూతనంగా చెక్డ్యామ్లు ఏర్పాటు చేయాలని, పేరపళ్ల జయమ్మ చెరువుకు లీకేజీలు సరి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యవసాయ బావులకు ఇచ్చే విద్యుత్ కనెక్షన్లను పెండింగ్లో పెట్టకుండా వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.
మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి అధ్యక్షతన 3వ (వ్యవసాయం) స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో పశు సంపదను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి రైతు లబ్ధిపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో చెప్పారు. ఆయా సమావేశాల్లో కోస్గి జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు వహీద్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.