‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడ మల్లన్న’ అనే విధంగా ఉంది రైల్వే శాఖ తీరు. కాపలా లేని లెవెల్ క్రాసింగులే తమ లక్ష్యంగా ప్రకటించుకున్న రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన రైల్వే అండర్ పాస్లను ఏర్పాటు చేసింది. లెవల్ క్రాసింగుల వద్ద సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు తీసుకున్న నిర్ణయం వర్షాకాలం వస్తే మాత్రం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నది. వర్షాకాలం వస్తే చెరువులను తలపిస్తూ నరకాన్ని చూపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఏర్పాటు చేసిన అండర్ పాస్ల వల్ల ప్రజలు ఆగమాగమవుతున్నారు.
మహబూబ్నగర్ అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏరుదాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న విధంగా ఉంది రైల్వే శాఖ తీరు. కాపలాలేని లెవెల్ క్రాసింగులే తమ లక్ష్యంగా ప్రకటించుకున్న రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన రైల్వే అండర్పాస్లను ఏర్పాటు చేసింది. లెవల్ క్రాసింగుల వద్ద సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు చేసిన ఏర్పాటు వానకాలం వస్తే మాత్రం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. వానొస్తే చెరువులను తలపిస్తూ అండర్పాస్లు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. పలుచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఏర్పాటు చేసిన అండర్పాస్ల వల్ల ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
కాచిగూడ నుంచి కర్నూలు వరకు..
కాపలాలేని లెవల్ క్రాసింగుల వద్ద జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు, కాపలా ఉండే లెవెల్ క్రాసింగులను తొలగించేందుకు రైల్వేశాఖ అండర్పాస్ లను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కర్నూలు వరకు 15 అండర్పాస్లను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నిచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినా.. మిగతా చోట్ల పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో వానకాలం వచ్చిందంటే చాలు అండర్పాస్ అంతా నీటితో నిండిపోతుంది. అండర్పాస్ దాటి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. శనివారం కురిసిన భారీ వర్షాలకు బాలానగర్ అండర్పాస్ వద్ద వాహనాలు దాటేందుకు వర్షపునీరు అడ్డుగా మారింది. నాలుగు చక్రాల వాహనాలు ఎలాగోలా దాటినా ద్విచక్ర వాహనాలు మాత్రం ఆగిపోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. బాలానగర్ నుంచి గౌతాపూర్, బోడజానంపేట, అప్పాజిపల్లి, బోడగుట్ట తండా, పెద్దరేవల్లి, ముదంపల్లి, చిన్నరేవల్లి, తొమ్మిదిరేకుల గ్రామాలకు సుమారు గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. గతేడాది రాజాపూర్ వద్ద ఉన్న అండర్పాస్ వద్ద వర్షపునీటితో ఓ కారు మునిగిపోయింది. ఈ అండర్పాస్ వద్దే గతేడాది పెద్ద ఎత్తున చేపలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వలలు వేసి పట్టుకున్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా నిలుస్తున్నది. వర్షం వచ్చిందంటే చాలు అండర్పాస్ అంతా నీళ్లు నిలిచిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.
సరైన నిర్వహణ లేక…
అండర్పాస్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా కాపలా లేకుండానే రైల్వే పట్టాలను దాటి వెళ్లేందుకు రైల్వేశాఖ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. కానీ, వాటిని నిర్మించిన తర్వాత నిర్వహణ లేకపోవడం ఇబ్బందిగా మారుతున్నది. కొన్ని అండర్ పాస్ల వద్ద డ్రైనేజీ వ్యవస్థ బాగుండటంతో వర్షం పడినా నీళ్లు నిలువకుండా దిగువనకు వెళ్తున్నాయి. కానీ, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనిచోట, బాగున్నా చెత్తాచెదారం నిండి నీళ్లు నిలుస్తున్నాయి. భారీ వర్షాలు పడినప్పుడు అండర్పాస్ కాస్త చెరువుగా మారుతుంది. దీంతో వాహనాలు దాటే పరిస్థితి లేదు.