ఊట్కూర్, సెప్టెంబరు 18 : తల్లుల ఆరోగ్యమే ఆరోగ్యవంతమైన తరానికి పునాది అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. గర్భిణిలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామ రైతువేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు గర్భధారణ ప్రారంభం నుంచే తల్లి ఆరోగ్యం, పోషకాహారం కీలకమన్నారు.
ప్రసవం అనంతరం శిశువుకు వెంటనే ముర్రుపాలు అందించాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఆరు నెలల్లోపు పిల్లలకు నీరు, తేనె వంటి ప్రత్యామ్నాయ ఆహారాలు ఇవ్వొద్దన్నారు. బాలింతలు సంప్రదాయ నమ్మకాలతో ఆహార పదార్థాలను దూరం చేయకుండా వైద్యుల సూచనల మేరకు సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు.
చిన్నారులకు అధిక ఉప్పు, నూనెతో తయారైన ప్యాకేజ్డ్ స్నాక్స్, జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలని సూచించారు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలతో పోషకాహారం అందించాలన్నారు.
18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేయకుండా చట్టాన్ని పాటించాలని కోరారు. గర్భిణీల ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి వైద్య సేవలు అందేలా ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రక్తహీనత ఉన్న గర్భిణిలను గుర్తించి వెంటనే చికిత్స అందించాలన్నారు. తక్కువ బరువు, పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణిలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్ గౌడ్, సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, సూపర్వైజర్ అంజమ్మ, సర్పంచ్ రాములు, అంగన్వాడీ టీచర్ జ్యోతిలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.