మాగనూరు, సెప్టెంబర్ 07: రైతు సమస్యలపై గళమెత్తిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప ఖండించారు. రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై మారెప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న రామ్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దాంతో, ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే రామ్మోహన్ రెడ్డి వంటి వారి గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప విమర్శించారు.
“రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడుతున్న రామ్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది” అని పల్లె మారెప్ప అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని మారెప్ప స్పష్టం చేశారు.