నారాయణపేట జిల్లాగా ఏర్పడిన తరువాత ప్రగతిబావుటా ఎ గురవేస్తున్నది. ఎన్నికల సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవతో రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో విశాలమైన రహదారులు, బట్టర్ఫ్లై లైట్లు, పార్కులు, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలతో నూతన హంగులు అద్దుకున్నాయి. ఒకప్పటి పట్టణానికి.. నేటికి పోలికే లేదన్నట్లుగా పనులు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మించారు.
నారాయణపేట, అక్టోబర్ 10 : మరోమారు నారాయణపేట ఎమ్మెల్యేగా ఎస్.రాజేందర్రెడ్డిని ఆశీర్వదించండి… అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నారాయణపేట జిల్లా ఏర్పాటుకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టింది. నారాయణపేట జిల్లా పరిధిలో ప్రస్తుత నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూర్లను చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న పేటను జిల్లాగా ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద నారాయణపేట 32వ జిల్లా ఏర్పాటు చేయించడంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. జిల్లా ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి జిల్లాకు తగ్గట్టుగా ఉండాల్సిన ప్రభుత్వ భవనాలను, విశాలమైన రోడ్లను, బట్టర్ ఫ్లై రోడ్లను, పార్కులను, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేయించారు. జిల్లా దవాఖాన నిర్మాణనికి రూ.56 కోట్లు, నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి రూ.55 కోట్లు, కలెక్టర్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.8కోట్ల 65లక్షలు, ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి రూ.38కోట్ల 60లక్షలు, మినీ స్టేడియం నిర్మాణానికి రూ.10కోట్ల 65లక్షలు, మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ.180కోట్లు, నారాయణపేటలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మాణానికి రూ.4కోట్ల 50లక్షల నిధులు తీసుకొచ్చారు. వీటిలో చాలా వరకు పనులు కొనసాగుతున్నాయి.