ఊట్కూర్, (కృష్ణ) ఏప్రిల్ 7 : నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం హిందూపూర్ శివారులోని పచ్చని పొలాల్లో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటైతే ప్రజల ఆరోగ్యానికి, పంట పొలాలకు, పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ మండలంలోని హిందూపూర్ శివారులోని 2010, 2011 సర్వే నెంబర్లలో రైతుల వ ద్ద కొనుగోలు చేసిన 24 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు దేవ్శ్రిస్టి బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొందింది.
పరిశ్రమ నిర్మాణానికి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) నిధులు మంజూరు చేయగా రూ.200 కోట్ల వ్యయంతో ఏడాది కిందట పనులను ప్రారంభించారు. ఈ విషయం రైతులకు ఆలస్యంగా తెలియడంతో ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపడమే కాకుండా పంట పొలాలకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా హిందూపూర్, గుడెబల్లూర్, కున్షీ గ్రామాలకు సంబంధించిన 36 వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం ఏర్పడింది.
దీని ద్వారా రైతులు ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి దేవ్శ్రిస్టి బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే అరవైశాతం పూర్తి చేయగా మరో నాలుగు నెలల్లో ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. కాగా, పంట పొలాలనే నమ్ముకొని జీవిస్తున్న గుడెబల్లూరు, హిందూపూర్ సరిహద్దు శివారులో ఓ సంస్థ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం రైతుల వ్యతిరేకతకు కారణమవుతున్నది. పచ్చని తమ పొలాల మధ్య ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ ఇప్పటికే రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు.
గతంలో పక్కనే కృష్ణమ్మ ప్ర వహిస్తున్న తమ పంట పొలాలకు చుక్క నీరు ఉండేది కాదని, సాగునీటి సౌకర్యం లేక పొలాలు బీళ్లుగా వదిలి బతుకు దెరువు కోసం వలస వెళ్లిన వెనుకటి రోజులను స్థానిక రైతులు తిరిగి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తమ పొలాల మధ్య ఫ్యాక్టరీని తరలించేందుకు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని వేడుకుంటున్నారు. ఇదే విషయమై ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమది పూర్తిగా జీరో పొల్యూషన్ ఫ్యాక్టరీ అని, ఇథనాల్ పరిశ్రమ ద్వారా ఎలాంటి వ్యర్థ పదార్థాలు బయటికి వెలువడవన్నారు. వరి, గోధుమ, మొక్కజొన్న పంటలను బాయిలింగ్ చేసి ఆవిరిని స్టోరేజ్ చేస్తామని వెల్లడించారు. దీని వల్ల వాయు కాలుష్యం కూడా ఉండదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్నారు.