నారాయణపేట, జులై 21 : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతపై శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. అంటువ్యాధుల నివారణ కోసం అధికారులను అప్రమత్తం చేశామని, మలేరియా, టైఫాయిడ్, డెంగీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో జీరో కేసుల నమోదే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతను ఏవిధంగా చేపట్టారు?
కలెక్టర్ : ఇప్పటికే జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించాం. వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశాం.
నమస్తే : నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా?
కలెక్టర్ : కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరద రానందున నదుల ప్రవాహం పెద్దగా లేదు. ఒకవేళ నదులు పొంగిపొర్లితే చేపల వేటను నిషేధించడంతోపాటు నదీ పరీవాహక ప్రాంతాల వద్దకు జనాలు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బందితో పర్యవేక్షణ చేపడతాం.
నమస్తే : జిల్లాలో వర్షపాతం నమోదు ఎలా ఉంది?
కలెక్టర్ : జిల్లాలో ఇప్పటివరకు మద్దూర్, కోస్గి మండలాల్లో మాత్రమే ఎక్కువగా నమోదైంది. మిగతా మండలాల్లో ఇప్పటివరకు అంత మొత్తంలో నమోదు కాలేదు.
నమస్తే : శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించారా?
కలెక్టర్ : శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉంటున్న జనాలను సమీపంలోని స్కూళ్లు, కళాశాల భవనాల్లోకి వెళ్లేలా చూడాలని, లేకపోతే బంధువుల ఇండ్లకు వెళ్లేలా పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు.
నమస్తే: నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లోని మ్యాన్హోల్స్ను గుర్తించారా?
కలెక్టర్ : మూడు మున్సిపాలిటీల్లో ఎక్కువగా మ్యాన్హోల్స్ లేవు. ఓపెన్ బావులను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయించాం.
నమస్తే: షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
కలెక్టర్ : వానకాలం అని కాకుండా మిగతా సమయాల్లోనూ ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా అన్ని గ్రామాలు, వార్డుల్లో విద్యుత్ వైర్లు కిందికి వేలాడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, సపోర్టింగ్ వైర్లు, ఇతరత్రా వైర్లు నీటితో తడిచి షార్ట్ సర్క్యూట్కు గురి కాకుండా చూడాలని సిబ్బందిని అప్రమత్తం చేశాం.
నమస్తే: అంటువ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
కలెక్టర్ : ఈసారి మలేరియా, టైఫాయిడ్, డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈసారి జిల్లాలో జీరో కేసుల నమోదుకు కృషి చేస్తున్నాం. ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవడంతోపాటు డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణకు ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించాం.
నమస్తే: ముంపు ప్రాంతాలను గుర్తించారా?
కలెక్టర్ : వానకాలంలో ధన్వాడ మండలం మందిపల్లితండాలోని పది ఇండ్లు ప్రతి ఏటా కొంతమేర ముంపునకు గురవుతున్నాయి. శాశ్వత పరిష్కారం దిశగా రూ.10లక్షలు వెచ్చించి వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకున్నాం.
నమస్తే: వానకాలం సీజన్కు సాగుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
కలెక్టర్ : ఈ సీజన్కు సరిపడా విత్తనాలు, ఎరువులు, యూరియా అందుబాటులో ఉన్నాయి.