నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమని పేర్కొన్నారు. అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి, ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని దరఖాస్తులను నింపాలన్నారు.
దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto) లో పొందుపరిచిన విధంగా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందజేస్తామని స్పష్టంచేశారు. ప్రతి పథకం లబ్దిదారునికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
అవినీతి అధికారిపై ఫిర్యాదు
భూ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల వద్దకు వెళితే లంచం డిమాండ్ చేశారని ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా ముట్టజెప్పానని వివరించింది. స్పందించిన మంత్రి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని, ఆధారాలు సమర్పిస్తే, విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.